గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల నేపథ్యంలో జనసేనకు మిత్ర పక్షం బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే, ఆ ప్రకటనను కనీసం పరిగణనలోకి తీసుకోని బీజేపీ, తామే మొత్తం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. చివరికి జనసేన పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సర్దిచెప్పేందుకోసమంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్రెడ్డితోపాటు, బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత లక్ష్మణ్, పవన్ కళ్యాణ్తో భేటీ అయి మమ అనిపించేశారు. మరి, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఏం జరుగుతుంది.? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
తిరుపతి విషయంలోనూ బీజేపీది అదే జోరు..
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అందరికంటే ముందుగా అడుగు వేసింది భారతీయ జనతా పార్టీనే. అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా, తామే తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. దాంతో, జనసేన పార్టీ షాక్కి గురయ్యింది. 2019 ఎన్నికల్లో బీజేపీతో పోల్చితే, జనసేన పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎక్కువ. జనసేన ఓ ఎమ్మెల్యే సీటు దక్కించుకుంది.. బీజేపీకి అదీ లేదు. అయినాగానీ, 2019 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు చూస్తే, జనసేన కంటే కొంత బీజేపీనే యాక్టివ్గా వుంది.
జనసైనికుల్లో ఇంకా ఆశలున్నాయా.?
‘మేం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నాం.. బీజేపీ మాకు తిరుపతి ఉప ఎన్నికలో మద్దతివ్వాలి..’ అని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. నిఖార్సయిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. తమ పార్టీకి బీజేపీ కారణంగా జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ, అధినేత పవన్ కూడా, బీజేపీ నిర్ణయాల్ని స్వాగతిస్తున్నప్పుడు.. జనసైనికులు మాత్రం ఏం చేయగలరు.?
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీతో పోల్చితే, జనసేనకు కొంత ఎడ్జ్ వుంటుంది. సినీ గ్లామర్ సహా, చాలా ఈక్వేషన్స్ జనసేనకు కలిసొచ్చే అవకాశం వుంది. కానీ, బీజేపీ డామినేషన్ ముందు జనసేన నిలబడి, పోటీలోకి దిగడం సాధ్యం కాకపోవచ్చు.