Arava Sridhar: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలు, తాజాగా తనపై మరియు తన అనుచరుడిపై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి దిగారని ఆరోపించడం కలకలం రేపుతోంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన కుమారుడి కోసం స్నాక్స్, పూలు కొనేందుకు ‘గోపి’ అనే వ్యక్తితో కలిసి రైల్వే కోడూరు టోల్ గేట్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఒక వేడుక కోసం అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు కార్యకర్తలు పథకం ప్రకారం దాడికి దిగారని ఆమె ఆరోపించారు.
“తాతంశెట్టి నాగేంద్ర మరియు ఇతరులు కలిసి నా వెంట ఉన్న గోపిని తరిమి తరిమి కొట్టారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు నాపై కూడా దాడి చేశారు. రోడ్డు మీద ఒక ఆడపిల్లను కొడితే భయపడతానని అనుకుంటున్నారు.. కానీ నేను ఎవరికీ భయపడను, న్యాయం జరిగే వరకు పోరాడతాను.” – బాధిత మహిళ

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నెలలుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆమె గతంలోనే హెచ్చరించారు.
ఈ దాడి ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలోనే పోలీసులు తమకు నోటీసులు ఇచ్చారని, భద్రత దృష్ట్యా కెమెరాలు ఏర్పాటు చేసుకోమని సూచించారని ఆమె పేర్కొన్నారు. తాము పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కూడా వెంటాడి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఇప్పటికే ఇరకాటంలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు, తాజా దాడి ఆరోపణలు మరింత తలనొప్పిగా మారాయి. సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసిన వీడియోలు చర్చనీయాంశంగా మారగా, ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వం మరియు జనసేన పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.

