దేశంలో అనేక పవిత్రనదులు ఉన్నాయి. వీటిలో 12 ప్రముఖ నదులుగా పరిగణిస్తారు. ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరం జరుగుతుంది. ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురుగ్రహ సంచారాన్ని బట్టి ఈ పుష్కరాలు జరుగుతాయి. గురుగ్రహం ఈ ఏడాది మకర రాశి సంచారం ప్రారంభించడాన్ని పురస్కరించుకుని తుంగభద్ర నదికి పుష్కరాలు మొదలయ్యాయి. నవంబర్ 20తో ప్రారంభమైన ఈ పుష్కరాలు డిసెంబర్ 1 వరకు కొనసాగుతాయి. సుమారు 147 కిలోమీటర్ల పొడవున పారే ఈ నది రెండు నదుల సంగమం. తుంగ, భద్రా నదులు కలిసి ప్రవహిస్తుండడం వల్ల ఈ నదికి తుంగభద్ర అనే పేరు స్థిరపడింది.
తుంగభద్రా ప్రస్థానం…
కర్ణాటకలోని గంగమూ అనే ప్రాంతంలోని వంహ పర్వతంలో పుట్టిన తుంగా నది మధ్యలో భద్రా నదిని కులుపుకుని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో ప్రవహిస్తోంది. చాలా దూరం ఒంటరిగానే ప్రవహించిన తుంగా నది.. కర్ణాటకలోని షిమోగా నగరానికి దగ్గరగా ఉన్న కూడలీ గ్రామం దగ్గర పుట్టిన భద్రానదితో కలుస్తుంది. అక్కడి నుంచి ఈ రెండు నదులూ కలిసిపోయి ప్రవహిస్తూ వచ్చి తెంగాణలో ప్రవేశించి, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడ సంగమేశ్వరం అనే గ్రామంలో కృష్ణానదితో కలుస్తుంది. ఈ మూడు రాష్ట్రాలోనూ కలిపి ఏడు లక్షల హెక్టార్ల పంట పొలాలకు సాగు నీరందించడమే కాకుండా, సుమారు 50 లక్షల మంది దాహార్తిని తీరుస్తోంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న హోస్పేట దగ్గర ఈ నది మీద తుంగభద్రా ప్రాజెక్టును నిర్మించారు.
తుంగ భద్రా నది ఒడ్డున ఈ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు వేలాది ఆలయాలు ఉన్నాయి. వాటిలో చాలా ఆలయాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి. శక్తి పీఠం అయిన అలంపూర్ లోని జోగులాంబ ఆలయం కూడా ఒకటి. మూడు రాష్ట్రాలోనూ కలిపి సుమారు 24 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరణ్యాల ద్వారా కూడా ఈ నది ప్రవహిస్తోంది. ఎన్నో మూలిక మొక్కలు, చెట్ల మధ్య ప్రవహించే ఈ నదికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. కర్ణాటకలోని ఈ అరణ్యాలను ఆరోగ్య వనాలుగా పరిగణిస్తారు. దేశంలోని పరమ పవిత్ర నదుల్లో తుంగభద్ర కూడా ఒకటని, ఇది దాదాపు గంగానదితో సమానమని ప్రజలు భావిస్తారు.