ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… భార్య, కొడుకును కాల్చి బూడిద చేశాడు

వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి  కాపురానికి గుర్తుగా పండంటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఇంతలోనే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో వారు విడిపోయి వేరుగా ఉంటున్నారు. మాట్లాడుకుందామని పిలిచి భార్య బిడ్డలను బూడిద చేశాడు. అసలు వివరాలు ఏంటంటే….

జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేష్, గూడూరుకు చెందిన కందిగ శ్రుశ్రుత 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరివి వేర్వేరు సామాజిక వర్గాలు. వీరు పెళ్లి చేసుకొని ఉప్పల్ లో కాపురం పెట్టారు. వీరికి నాలుగు నెలల కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య తరచూ విబేధాలు జరుగుతున్నాయి. దీంతో శ్రుశ్రుత నెల రోజుల నుంచి తల్లిగారింటి వద్ద ఉంటోంది. తమ సమస్యలను పరిష్కరించుకుందామని భార్యకు ఫోన్ చేసిన రమేష్ ఉప్పల్ కు రమ్మన్నాడు. 

బూడిదలుగా మారిన తల్లి, కొడుకు

భర్త మారాడని శ్రుశ్రుత భావించి ఉఫ్పల్ ఓ ఆర్ ఆర్ దగ్గరకు వచ్చింది. అక్కడ రమేష్ కు శ్రుశ్రుతకు మళ్లీ గొడవ జరిగింది. దీంతో శ్రుశ్రుత తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను మింగింది. తాను వేసుకోవడమే కాకుండా తన బాబుకు కూడా పాలలో కలిపి ఇచ్చింది. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఘట్కెసర్ మున్సిపాలిటి పరిధిలోని కొండాపూర్ గ్రామం ప్రభాకర్ ఎన్ క్లేవ్ ప్రాంతానికి రమేష్ తరలించి వారిద్దరి పై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీంతో వారు కాలి బూడిదయ్యారు. అనంతరం రమేష్ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.