లారీ ఢీకొని బీటెక్ అమ్మాయి స్పాట్ డెడ్

అతివేగంగా వచ్చిన లారీ వారి పాలిట మృత్యువుగా మారింది. రోడ్డు ప్రమాదంలో బిటెక్ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది.  దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ లోని న్యూ నాగోల్ కాలనీకి చెందిన సతనపల్లి రామబ్రహ్మం, కల్పనల కూతురు నవ్యశ్రీ, మోహన్ నగర్ ప్రజా నివాస్ కు చెందిన కీర్తి కుమార్ రెడ్డి కూతురు సాతన స్నేహితులు. వీరు తట్టి అన్నారంలో ని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం కాలేజి పని నిమిత్తం హోండా యాక్టివా పై బయల్దేరారు. కాలేజిలో ప్రాజెక్టు పని నిమిత్తం వెళ్లినట్టు తెలుస్తోంది. 

బండ్లగూడ ఆర్టీసి డిపో దగ్గరకు వెళ్లి కాలేజిలో ఉంటారో ఉండరోనన్న అనుమానంతో తిరుగు ప్రయాణమయ్యారు.  వారు రాజీవ్ స్వగృహకల్ప దగ్గరకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీ కొట్టింది. దీంతో నవ్యశ్రీ లారీ చక్రల కింద పడి చనిపోయింది. సాధన పక్కకు కావడంతో గాయాలతో బయటపడింది. నవ్యశ్రీ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అందరితో కలిసిమెలిసి ఉండే నవ్యశ్రీ ఆకస్మికంగా మరణించడంతో స్నేహితులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సాజిద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.