వారమే గ్యాప్, రామ్ చరణ్ రెండు సినిమాలు రిలీజ్

అవును! నిజమే..కేవలం వారం రోజుల గ్యాప్ లోనే రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మన తెలుగులో కాదు..మళయాళంలో. ఈ మ‌ధ్యన మన హీరోల సినిమాల‌కి కేరళలోను మంచి డిమాండ్ ఏర్ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్ , మ‌హేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు ఇప్ప‌టికే అక్కడ విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చిత్రాలు మ‌ల‌యాళంలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. అయితే ఆ రిలీజ్ టైం గ్యాప్ చూసి పెట్టుకుంటే బాగుండేది. అలా కాకుండా కేవలం ఒకే వారం గ్యాప్ లో రెండు సినిమాలు డబ్ చేసి జనాల మీదకు వదిలేస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన రంగ‌స్థ‌లాన్ని జ‌న‌వ‌రి 18న కేర‌ళ‌లో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం విన‌య విధేయ రామ మూవీని జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేయ‌నున్నార‌ు‌. తెలుగులో ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.

అంటే వారం రోజుల గ్యాప్‌లో మ‌ల‌యాళంలో విడుద‌ల కానున్న రంగ‌స్థ‌లం, విన‌య విధేయ రామ చిత్రాలు అక్కడి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తాయ‌ని చరణ్ టీమ్ భావిస్తుంది. విన‌య విధేయ రామ చిత్రం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ చేతుల మీదుగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.