‘ముద్ర’: నిఖిల్ కు ఏం చేయాలో తోచటం లేదట

ఈ సంవత్సరం మొదట్లో ‘కిరాక్‌ పార్టీ’ అంటూ యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే అది కిక్ ఇవ్వలేదు. దాంతో తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు ఈ హీరో. తమిళ్‌లో విజయం సాధించిన కనితన్‌ మూవీని తెలుగులో ‘ముద్ర’ గా రీమేక్‌ చేసాడు. జర్నలిస్ట్‌ సురవరం అర్జున్‌ పాత్రలో నిఖిల్‌ నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది.

 

మొదట ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్‌ 8న రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ నవంబర్‌ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లపై దాడి చేయటంతో వెనక్కి తగ్గారు. విజయ్‌ ‘సర్కార్‌’, ఆమిర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ దీపావళి కానుకగాకే విడుదల కానుండగా.. రజనీకాంత్‌ 2.ఓ నవంబర్‌ చివరి వారంలో వచ్చింది.

ఈ నేపథ్యంలో నిఖిల్‌ తన ‘ముద్ర’ను డిసెంబర్‌ 28 న వేయబోతున్నాడని వినపడింది. అయితే ఇప్పటిదాకా ప్రమోషన్స్ అయితే ప్రారంభం కాలేదు. దాంతో ఆ డేట్ కూడా డౌటే అని, వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి సైలెంట్ అయ్యారని చెప్తున్నారు.

నిఖిల్‌ నటిస్తోన్న 16వ చిత్రం ‘ముద్ర’ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీ.యన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు.