డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు… పవన్ పై వైసీపీ పంచ్!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడిని.. జనసేన అధినేత పవన్‌‍ కల్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చి రాగానే.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామని ప్రకటించారు. అలా టీడీపీతో పొత్తుపై అధికారికంగా ప్రకటించిన అనంతరం… వారాహి యాత్ర నాలుగో విడత ప్రారంభించారు.

ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలో కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో సభలు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో టీడీపీ కష్టాల్లో ఉంది కాబట్టే… తాను బీజేపీని వదిలి ఆ పార్టీతో కలుస్తున్నట్లు పవన్ చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఎన్ డీయే కూటమిలో ఉన్నా కూడా ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే… తనను తాను ఓ గొప్ప ఫైటర్ గా చెప్పుకునే ప్రయత్నమో ఏమో కానీ… ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తాను పోరాడినట్లు చెప్పుకున్నారు పవన్. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు తాను తీవ్రంగా పోరాడినట్లు చెప్పుకున్నారు. తనకున్న గుండె ధైర్యంతో అది సాధ్యం అయ్యిందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలపై వైసీపీ సీరియస్ గా స్పందించింది.

ఇందులో భాగంగా ట్విట్టర్ వేదికగా… పవన్ వీడియోను పోస్ట్ చేస్తూ… కౌంటర్ ఇచ్చింది. “నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత!” అంటూ మొదలుపెట్టిన వైసీపీ… వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ పవన్ కల్యాణ్” అంటూ ఫైరయ్యింది.

ఇదే సమయంలో… “డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు.. కానీ, అప్పటికే సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీగా ఉన్నారు. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు ప్యాకేజ్ స్టార్” అంటూ వాయించింది!

అనంతరం… “పులివెందుల వాళ్ళు రౌడీలు అయితే ఆ ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులను తెలుగు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోరు కదా! నువ్వు అంత గొప్పోడివి అయితే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను రెండు చోట్లా ఓడించరు కదా? రాజశేఖర రెడ్డి గారితో పోరాడా అని… ఇలా ఊరూరా తిరిగి సొల్లు కబుర్లు చెప్పడం మానేసి ప్రజలకు ఏం చేస్తావో అది చెప్పు నాలుగు ఓట్లు అయినా పడతాయ్!” అంటూ ఇచ్చి పడేసింది వైసీపీ!