వలసలు.. పులసల కంటే మజా.. మజా..!

అప్పుడెప్పుడో..అంటే జగన్మోహనరెడ్డి మాంచి జోష్ మీదున్న రోజుల్లో..

శాసనసభలో మస్తు మెజారిటీ.. పార్లమెంటులో గట్టి బలం.. చేతి నిండా అధికారం.. గుండె నిండా దమ్ము..

ఇయ్యన్నీ ఉన్న రోజుల్లోనే.. మంత్రివర్గ పునర్నిర్మాణానికి పూనుకున్నప్పుడు.. (నిజానికి రెండున్నరేళ్ల తర్వాత క్యాబినెట్ ను మారుస్తానని జగన్ ముందే చెప్పి ఉన్నారు) కొందరు వైసీపీని విడిచి పోతారనే ప్రచారం జరిగింది. జగన్ తన మంత్రివర్గంలో ఉన్నవారందరినీ తప్పించి పూర్తిగా కొత్తవారిని తీసుకుంటారని అనుకున్నారు.

అధికారం చేపట్టిన వెంటనే జగన్ ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు కూడా ..అప్పుడే ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉన్న బొత్స సత్తిబాబు..పెద్దిరెడ్డి..వారిద్దరినీ తప్పిస్తే పార్టీ విడిచి వెళ్ళిపోతారని..ఊరికే వెళ్లకుండా తమ వెంట పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తీసుకుపోతారనే వ్యాఖ్యానాలు గట్టిగా వినిపించాయి.అందుకు అనుగుణంగానే జగన్ ఆ ఇద్దరినీ మంత్రులుగా కొనసాగిస్తూ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసారు.మడమ తిప్పని జగన్ను ఆ ఇద్దరూ మడత పెట్టేసారని అప్పట్లో అందరూ అనుకున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అంత పవర్ ఫుల్ గా ఉన్న రోజుల్లోనే ఇద్దరు నాయకులు బయటికి వెళ్ళిపోతామని బెదరిస్తే జగన్ వెనకడుగు వేశారని అనుకుంటే ఇప్పుడు తానుగాక వైసీపీలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలలో కొందరు.. వారు గాక కీలకమైన నేతలు పార్టీ విడిచి వెళ్ళిపోతే జగన్ పరిస్దితి ఏంటి..!?

ఇప్పటికే సత్తిబాబు విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అవి నిజమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేము. సత్తిబాబే గనక దాటిపోతే విజయనగరం జిల్లా వైసీపీ చాలా మటుకు ఖాళీ అయిపోవడమే గాక ఆ ప్రభావం ఉత్తరాంధ్రలోని మిగిలిన రెండు జిల్లాలపై కూడా ఉంటుంది.అలాగే పెద్దిరెడ్డి కూడా..ఆయన సత్తిబాబులా కాక ఎమ్మెల్యేగా ఉన్నారు కూడా..సో..అప్పుడే అంత ప్రమాదం అనుకుంటే ఇప్పుడు అలాంటిది జరిగితే..అంటే సత్తిబాబు..పెద్దిరెడ్డి వంటి వారు జంప్ జిలానీలుగా మారితే వైసీపీ కిస్మత్ కీ కహానీ ఏంటి.. ఆల్రెడీ.. వైసీపీ ఎమ్మెల్యేలో కొందరు..మాజీ ఎమ్మెల్యేలు..ఎంపీలు చాలా మంది వేరే పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అన్నా..”కొంచెం పెద్దాయనతో మాట్లాడి తలుపులు తెరిపించు” .. ఇదీ వరస..! ఇప్పటికే వైసీపీలో రాజీ”నామాల” పర్వం మొదలైంది.ఈ ఊపు కొనసాగితే..అప్పుడిక తాడేపల్లి.. తాడే”పిల్లే”..!?