పవన్ ను వెంటాడుతున్న ద్వారంపూడి… పరువు తీస్తున్నారుగా!

సర్పవరం జంక్షన్ లో జరిగిన జనసేన బహిరంగ సభలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తన తాత ముత్తతల చరిత్రను సైతం వెక్కిరించేలా పవన్ వ్యాఖ్యానించారు. దీంతో… ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ద్వారంపూడి మైకులముందుకు వచ్చారు. పవన్ కు ఒక ఛాలెంజ్ చేశారు.

పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలపై స్పందించిన ద్వారంపూడి.. తీవ్రస్థాయిలో పవన్ పై ఫైరయ్యారు. ధమ్ముంటే తనపై పోటీ చేయాలని సూచించారు. తనను ఓడిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ ఛాలెంజ్ విసిరారు. పవన్ ఓడిపోయినా అదేపనిచేయాలని సూచించారు. అయితే ఈ ఛాలెంజ్ లపై పవన్ ఇప్పటివరకూ స్పందించలేదు. అయినా కూడా ద్వారంపూడి వదిలిపెట్టడం లేదు.

అవును… వచ్చే ఎన్నికల్లో కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తానని పవన్ శపథం చేయగా.. దమ్ముంటే పవన్ కల్యాణ్ నెక్ట్స్ ఎలక్షన్‌ లో కాకినాడలో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చాలెంజ్ చేశారు. అయితే ఈ ఛాలెంజ్ పై పవన్ మౌనంగా ఉన్నారు. దీంతో… పలాయనం చిత్తగించాడు పవన్ అని భావించారో ఏమో కానీ.. మరోసారి మైకులముందుకు వచ్చారు ద్వారంపూడి.

నా చాలెంజ్‌ కు పవన్ కల్యాణ్ స్పందించలేదు.. సవాల్ స్వీకరించకుండానే జనసేన అధినేత తోకముడిచి వెళ్లిపోతున్నారు అంటూ ద్వారంపూడి ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ ఆటలాడుతున్నారని అన్నారు. ఫలితంగా చంద్రబాబుతో కలిసి పవన్… రాష్ట్రంలో కులాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు!

అయితే పవన్ గతంలో కూడా ఏ సభలో అయినా విమర్శలు చేస్తే.. దానికి ప్రత్యర్థులు కౌంటర్స్ వేస్తే.. అనంతరం ఆ ఛాలెంజ్ లకు, ప్రతి విమర్శలకు స్పందించారు.. పలాయనం చిత్తగిస్తారు.. తోక ముడుస్తారు.. అనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో నిత్యం వినిపిస్తుంటాయి. తాజాగా ఆ కామెట్లకు బలం చేకూర్చేలా పవన్.. ద్వారంపూడి విషయంలో ప్రవర్తించారు!