YS Jagan: చంద్రబాబుకే ఆ రికార్డులు సాధ్యం.. జగన్ సెటైర్లు

YS Jagan

సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు పట్టవంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉల్లి, టమోటా రైతుల దీనస్థితిని తెలిపేలా ఓ వీడియోను పంచుకున్నారు.

పంటలకు ధరల పతనంలో చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మండిపడ్డారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా.. రూపాయిన్నరకే కిలో టమోటానా.. ఇవేం ధరలు? అని ఫైర్ అయ్యారు. ఈ ధరతలో రైతు అనేవాడు బతకొద్దా? అని ప్రశ్నించారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా కనికరం కూడా చూపడంలేదు కదా? అని ఆయన నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? అని దుయ్యబట్టారు. ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? అన్నారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా? అని పేర్కొన్నారు.

క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేశారని.. కానీ తూతూమంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారన్నారు. ఎవ్వరూ కొనడం లేదని.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి చేసిన ప్రయత్నం కాదా ఇది అని ఆగ్రహించారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు ఆన్‌లైన్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు?అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు బజార్‌లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? అన్నారు. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదన్నారు.

ఇది మీ తప్పు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయమన్నారు. మరోవైపు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారని వాపోయారు. తక్షణమే రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని జగన్ డిమాండ్ చేశారు.