వైఎస్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వైఎస్ నుండి జగన్ నేర్చుకోవాల్సిందంటే వైఎస్ పాదయాత్ర చేసిన తర్వాత మొదలుపెట్టిన రాజకీయం గురించి మాత్రమే. ఎందుకంటే వైఎస్ గురించి చెప్పాలంటే పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత అని రెండు భాగాలుగా చెప్పాలి. మొదటి భాగంలో వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యారు తప్ప వర్గ నాయకుడిగా పెద్దగా సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. పాదయాత్రకు ముందు వైఎస్ రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం ఎదురుదెబ్బలతోనే సరిపోయిందన్నదే వాస్తవం.

 

ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటి నుండే వైఎస్ లోని దూకుడంతా తగ్గిపోయింది. పాదయాత్రను దిగ్విజయంగా ముగించిన తర్వాతే రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నేత అనిపించుకున్నారు.  ఇక్కడ జగన్ నేర్చుకోవాల్సింది పాదయాత్ర తర్వాత వైఎస్ అనుసరించిన వైఖరినే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైఎస్ పాదయాత్ర సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. 2003లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దింపటమే ఏకైక లక్ష్యంతో అప్పట్లో వైఎస్ చొరవ తీసుకుని ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని వెళ్ళారు. అప్పట్లో వైఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించబట్టే చంద్రబాబును గద్దె దింపి సిఎం అవ్వగలిగారు.

 

ఇక్కడే జగన్ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా టిఆర్ఎస్, వామపక్షాలను కలుపుకుపోవటంలో వైఎస్ సక్సెస్ అయ్యారు. అదే విషయాన్ని ఇఫుడు జగన్ గుర్తుంచుకోవాలి. ఒకరకంగా ఇపుడు కూడా చంద్రబాబు పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకతుంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. రేపటి ఎన్నికల్లో సిఎం అయ్యే అవకాశం పవన్ కన్నా జగన్ కే ఎక్కువుంది. లేకపోతే ఇంతకాలంగా జగన్ చేస్తున్న పోరాటం, పాదయాత్ర వృధా అయి మళ్ళీ చంద్రబాబే సిఎం అయ్యే అవకాశాలును కొట్టిపారేయలేం.

 

అప్పట్లో వైఎస్ కు లేని అనుకూలత ఇపుడు జగన్ కు ఉంది. అదేమిటంటే, వైసిపి అన్నది జగన్ సొంత ప్రాపర్టీ లాంటిదే. తన మాటకు ఎదురుచెప్పే వారు లేరు కాబట్టి ఏ నిర్ణయమైన తీసుకునే స్వేచ్చ జగన్ కుంది. కాబట్టి తనకున్న అధికారాలను జగన్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతిపక్షాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ప్రతిపక్షాల్లో ఎవరికైనా ఉంది అంటే అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రమే. కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపిలు వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి. కాబట్టి జగన్ క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రిస్టేజికి పోకుండా సరైన నిర్ణయం తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.