లండన్ నుంచి తిరిగొచ్చిన జగన్… ఈ రోజు పని ఇదే!

ఇంతకాలం నమ్మేం పీకలేరు పీకలేరు అని ప్రసంగించిన చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. పైగా ఈ సమయంలో జగన్ ఏపీలో లేకపోవడం వారికి కాస్త వెలితిగా అనిపించిందని చెబుతున్నారు. అయితే తాజాగా జగన్ ఏపీకి తిరిగి వచ్చేశారు.

సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చారు. సుమారు 10 రోజుల పాటు పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయించిన జగన్… రాష్ట్రానికి తిరిగొచ్చారు. దీంతో పార్టీ నేతలు విజయోత్సాహంతో ఆయన్ను కలుసుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్ కు ఘన స్వాగతం పలికారు.

అయితే చంద్రబాబు జైలుకెళ్లడంతో వైసీపీ పండగ చేసుకుంటోంది. కొందరు నేతలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టుకున్నారు కూడా. దీంతో… చంద్రబాబు జైలు వ్యవహారాన్ని వారు విజయంగా భావిస్తున్నట్టు తేలిపోయింది. అయితే… జగన్ రాకతో ఆ విజయోత్సాహం అంతా ఎయిర్ పోర్ట్ లోనూ కనపడింది. అయితే జగన్ ఫీలింగ్స్ మాత్రం ఎప్పటిలాగే కనిపించడం గమనార్హం.

ఇక మరోపక్క జగన్ విమానాశ్రయం నుంచి తాడేపల్లి వరకు నాయకులు పోటీపడి స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా… బ్యారికేడ్ల వెనక ప్రజలంతా ప్లకార్డులు పట్టుకుని జగన్ కి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు ఎపిసోడ్ తర్వాత వైసీపీలో కొత్త సందడి బాగా పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… లండన్ పర్యటన అనంతరం జగన్ దూకుడు పెంచబోతున్నారని తెలుస్తుంది. పర్యటన అనంతరం నో రెస్ట్ అన్నట్లుగా ప్రోగ్రాంస్ ఫిక్సయ్యాయని సమాచారం. ఇందులో భాగంగా ఈరోజు శాంతి భద్రతల అంశంపై హోం శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీస్ వ్యవహారాలపై నివేదికలు పరిశీలిస్తారని సమాచారం.

అయితే ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. జగన్ స్పందిస్తారా.. స్పందిస్తే ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.