మంగళగిరికి జగన్ బంపర్ ఆఫర్..మంత్రి పదవి ప్లస్ ఎంఎల్సీ హామీ

మంగళగిరిలో ఓటర్లకు జగన్మోహన్ రెడ్డి బంపర్ హామీ ఇచ్చారు. ఒకటి కాదు రెండు హామీలను ఒకేసారి ఇచ్చారు.  మొదటిది గెలిపిస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రిపదవి రెండోది మంగళగిరిలోని చేనేతవర్గాలకు ఎంఎల్సీ పదవిని హామీ ఇచ్చారు. ఈరోజు మంగళగిరిలో జగన్ రోడ్డు షో చేశారు. ఈరోజు ప్రచారానికి చివరి రోజు కదా ? అందుకే మంగళిగిరిలో దాదాపు 30 నిముషాల పాటు ప్రసంగించారు.

ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై చంద్రబాబునాయుడు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుండి చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కున్న విషయాన్ని గుర్తుచేశారు. భూములు ఇవ్వటం ఇష్టంలేని రైతులకు మద్దతుగా ఆళ్ళ చేసిన పోరాటాలను జగన్ గుర్తు చేశారు. సొంత డబ్బులు పెట్టి ఆళ్ళ రాజన్న క్యాంటిన్లను నిర్వహించటం, తక్కువ ధరలకే కూరగాయలను సరఫరా చేయటాన్ని ప్రస్తావించారు.

జగన్ మాట్లాడిన అర్ధగంటలో టిడిపి నుండి పోటీ చేస్తున్న నారా లోకేష్ గురించి మాట్లాడింది చాలా తక్కువనే చెప్పాలి.  బహుశా జగన్ దృష్టిలో లోకేష్ అసలు గట్టి ప్రత్యర్ధే కాదేమో.  వైసిపి అధికారంలోకి రాగానే మంగళగిరి అభివృద్ధికి తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను జగన్ వివరించారు. అందులో భాగంగానే ఆళ్ళకి మంత్రిపదవితో పాటు చేనేతలకు ఎంఎల్సీ పదివిని బహిరంగంగానే ప్రకటించటం గమనార్హం.

నిజానికి ఆళ్ళ ముందు లోకేష్ ఎందులోను ఎదురు నిలవలేరన్నది వాస్తవం. కాకపోతే ముఖ్యమంత్రి కొడుకు, అధికార పార్టీ అభ్యర్ధికి తోడు డబ్బు బలం పుష్కలంగా ఉంది కాబట్టి ఆళ్ళ గెలుపు విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దాంతో ఆళ్ళ గెలవాలని చాలామందిలో ఉన్నా గెలుస్తాడని చెప్పే పరిస్ధితి లేదు. అందుకు విరుగుడుగానే జగన్ తన రోడ్డుషోలో ఆళ్ళకి మంత్రి పదవి, చేనేతలకు ఎంఎల్సీ అనే వ్యూహాత్మక ప్రకటన చేశారు. చేనేతలకు ఈ నియోజకవర్గంలో సుమారు 50 వేల ఓట్లున్నాయి. కాబట్టి జగన్ ప్లాన్ వర్కవుటవుందనే అనుకుంటున్నారు.