వైసీపీ, టీడీపీ… ఓ “ఎండమావి”గన్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా సంచలనం జగన్ తెరపైకి తెచ్చిన “మావిగన్” రాజధాని అంశం. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. ఒంటెద్దు పోకడలకు పోయి తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అనుకోకపోతే.. తాజా “మావిగన్” ఆప్షన్ అనేది ప్రాక్టికల్ గా అత్యంత సుసాధ్యమైన విషయమని.. దీనివల్ల అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా.. భారీగా విస్తరించే అవకాశం ఉందని.. తద్వారా ఫలితాలు రెట్టింపు వేగంతో వస్తాయని అంటున్నారు పరిశీలకులు, మేధావులు.

ఈ క్రమంలో ఈ తాజా మావిగన్ అంశం.. రాబోయే ఎన్నికల్లో ఎవరికి అధికారాన్ని ఎండమావిగా మార్చబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ఒకప్పుడు ఆయా పార్టీలకు పలు ప్రాంతాలు, కొన్ని జిల్లాలు, మరికొన్ని నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉండేవనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో ఆ రోజులు లేవనే చెప్పాలి. ఇక్కడ ప్రజలను నాయకుడు నమ్మించడం, ఒప్పించడం పైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు కృష్ణా, గుంటూరు ప్రాంతాలు టీడీపీకి కంచుకోటలు అని అనుకున్నవారికి 2019 ఎన్నికలు స్పష్టమైన సమాధానం చెప్పాయి. ఇక వైసీపీకి రాయలసీమ ప్రాంతాల్లో అత్యంత బలం ఉంది అనుకున్నవారికి 2024 ఫలితాలు మరింత స్పష్టత ఇచ్చాయి.

మరింత స్పష్టంగా చెప్పుకుంటే… మావిగన్ పేరు చెప్పి కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న టీడీపీకి జగన్ చెక్ పెట్టలేరని.. ఆ ప్రాంతాల్లో ప్రజలకు కేవలం అమరావతి మాత్రమే ముఖ్యం తప్ప మరొకటి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కట్ చేస్తే… 2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి 14, టీడీపీకి 2 స్థానాలు… గుంటూరులోని 17 స్థానాల్లో 15 వైసీపీకి, 2 టీడీపీకి వచ్చిన విషయాన్ని మరిచిపోతున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో 2024లో రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలోని 6 స్థానాల్లో కూటమికి నాలుగు రాగా, వైసీపీకి రెండే స్థానాల్లో విజయం దక్కింది. మరింత ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలోని 7 స్థానాల్లో 5 కూటమి గెలుపొందగా, వైసీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది.. అందులో ఒకటి ఆ పార్టీ అధినేత జగన్ పోటీ చేసిన పులివెందుల.

అంటే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… సమస్య అమరావతి అయినా.. మూడు రాజధానులు అన్నా.. మావిగన్ అని స్పష్టత ఇచ్చినా… ఇక్కడ జనాలు వాస్తవాలను గ్రహించే స్థితిలోనే ఉన్నారు తప్ప… ప్రచారాలకు, భ్రమలకు మధ్య బ్రతికే పరిస్థితిలో ఏపీ ప్రజానికం లేరు అనే విషయం నేతలు, పలువురు విశ్లేషకులు గమనించాలని అంటున్నారు.

కారణం ఏమిటంటే… ఏపీ ప్రజానికానికి రాజకీయ చైతన్యం ఎక్కువని… 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు అమరావతి అని బలంగా చెబితే జనం ఎలా నమ్మారో… 2029లో అంతకు మించి ప్రాకటికల్ గా సాధ్యమయ్యే విషయం మావిగన్ అని చెప్పినా జనం నమ్మే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తాజాగా ఈ స్పష్టత రావడానికి బలమైన కారణాలు గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అందుకు కారణం జగన్ మావిగన్ అని అంటే… మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అనిపించినా… అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు బాపట్ల జిల్లా వరకూ కూడా ఈ మావిగన్ అంశంపై పాజిటివ్ చర్చ మొదలైంది.

కేవలం అమరావతిలో మాత్రమే అభివృద్ధి జరగడం, అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోవడంతో పాటు మిగిలిన ప్రాంతాలు సైతం సమాంతరంగా అభివృద్ధి చెందడం అనే అంశం ఈ మావిగన్ ఆలోచనలో దాగి ఉందనేది తాజాగా ఏపీ ప్రజానికం నమ్మకంగా ఉందని అంటున్నారు.

పైగా… జగన్ చెప్పిన మావిగన్ ఆలోచన తమకు ఎప్పటి నుంచో ఉందని.. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలూ సీఆర్డీయే పరిధిలో ఉన్నాయంటూ సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పరోక్షంగా మద్దతు పలకడంతో పాటు జగన్ చెప్పిన ఈ 110 కిలోమీటర్ల మావిగన్ కారిడార్ లో రైల్వే జోన్ లు, పోర్టు, ఎయిర్ పోర్టు, నేషనల్ హైవే లు ఉండటంతో… ప్రపంచంతో అన్ని రకాలుగానూ కనెక్టివిటీ బాగుంటుందని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే… మావిగన్ ని వైసీపీ జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే… ఈ మావిగన్ కాస్తా టీడీపీకి రాబోయే రోజుల్లో అధికారాన్ని ఎండమావిగా మార్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

అలా కాకుండా తాము ఓ అంశాన్ని తెరపైకి తీసుకొస్తామే తప్ప… దాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లము, తానిపై తమ వైఖరిని బలంగా చెప్పము అన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంటే మాత్రం… ఆ ఎండమావి వారికీ వర్తిస్తుందని చెబుతున్నారు.