జగన్ ‘అన్న పిలుపు’ ..చంద్రబాబుకు షాక్

చంద్రబాబునాయుడుకు షాక్ కొట్టేట్లుగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తటస్తులను ఆకట్టుకునేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ జగన్ ప్రకటించిన పథకాలు, వరాల్లో ఒక్కొక్కటి చంద్రబాబు కాపీ కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ముందుగా ప్రకటించకుండా జగన్ ‘అన్న పిలుపు’ అనే కార్యక్రమాన్ని సడెన్ గా లాంచ్ చేశారు. జగన్ మొదలు పెట్టిన కొత్త కార్యక్రమంతో చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు విస్తుపోయారు. గ్రామం మొదలుకుని జిల్లా కేంద్రం వరకూ ప్రతీ చోటా ఎందరో తటస్తులుంటారు. ఇటువంటి వారికి రాజకీయాలతో సంబంధం ఉండదు. అటువంటి వారిని నేరుగా టచ్ చేయటమే జగన్ ఉద్దేశ్యం.

3648 కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ వేలాది గ్రామాలు తిరిగారు. అటువంటి గ్రామాల్లో జగన్ తో మాట్లాడిన చాలామందికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని గ్రహించారట. అటువంటి తటస్తులతో నేరుగా టచ్ లోకి వెళ్ళటం ద్వారా వారందరినీ వైసిపి వైపు మళ్ళించొచ్చనేది జగన్ వ్యూహం. ప్రతీ గ్రామంలోను ఎంపిక చేసిన వారికి లేఖలు రాయాలని జగన్ నిర్ణయించారు. అందులో పార్టీ విధానాలు, నవరత్నాలు, మ్యానిఫెస్టో తదితర అంశాలుంటాయి. అంతేకాకుండా పార్టీ నిర్మాణానికి తటస్తుల నుండి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ వ్యవహారం మొత్తం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం సూచనల ప్రకారమే జరుగుతోందట. ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో జరిపిన సర్వేలో తటస్థులను గుర్తించారట. అంటే ప్రశాంత్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే జగన్ లేఖలు రాస్తున్నట్లు సమాచారం. రాబోయే  లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి 43 శాతం, టిడిపికి 33 శాతం జనాల మద్దతుందని ఓ సర్వేల్లో తేలింది. లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి ఓట్లేస్తారు అనే అంశంపై జాతీయ స్ధాయి మీడియా నిర్వహించిన ప్రతీ సర్వేలోను రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 10 ఉందన్న విషయం తేలింది. అయితే దాన్నే ప్రమాణికంగా తీసుకునేందుకు లేదు. అందుకనే వీలున్నంతగా జనాల మద్దతును పెంచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు.

రెండు పార్టీలకు కలిపి 76 శాతం జనాలుంటే జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీల వైపు మరో 14 శాతం జనాలు మొగ్గు చూపుతున్నారు. అంటే మిగిలిన 10 శాతం మంది ఏ పార్టీకి ఓట్లేసేది సస్పెన్స్ అన్నమాట. కాబట్టే ఆ పదిశాతం జనాభాను వీలున్నంతలో వైసిపి వైపు మళ్ళించాలన్నది జగన్ ఆలోచన. అందులో భాగంగానే తటస్తులకు జగన్ లేఖలు రాస్తున్నాడు. జగన్ వ్యూహం ప్రకారం తటస్తుల్లో సగం వైసిపికి ఓట్లేసినా ప్రయత్నం ఫలించినట్లే కదా ? ఎందుకేంటే రెండు, మూడు శాతం ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేసేస్తుంది.  పోయిన ఎన్నికల్లో దెబ్బతిన్నారు కాబట్టే జగన్ ఈసారి జాగ్రత్త పడుతున్నట్లున్నారు.