భూమా అఖిలప్రియ చాప్టర్ క్లోజ్ అయినట్లేనా!

will Bhuma Akhila Priya Chapter is Closed ?

తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ న్యూస్ గా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిప్రియకు వెంటనే మంత్రి పదవి దక్కింది. ఇది నిజంగా అదృష్టమే. తొలిసారి గెలిచి, చిన్న వయసులో మంత్రి పదవి దక్కించుకున్న అఖిలప్రియ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకుంటుందని భావించారు. ఆ అభిమాన గణం తనతో జీవితాంతం అలానే ఉంటారని అనుకుంది. అధికారంలో ఉన్న సమయంలో వారికోసం ఏం చేయకుండా వదిలేసింది.

తన తల్లి, తండ్రి ఇన్ని సార్లు గెలవడానికి ఉపయోగపడిన సన్నిహితులు, క్యాడర్ ను కూడా అఖిలప్రియ తన వ్యవహార శైలితో దూరం చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో వైరం పెట్టుకున్నారు. ఏవీపై దాడి చేయించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసు కూడా నమోదయింది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పైనే ఎక్కువగా ఈ ఆరోపణలున్నాయి.

ఇక తాజాగా హైదరాబాద్ లోని ఒక ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ వెనక అఖిలప్రియ, భర్త భార్గవ్ రామ్ ఉన్నారు. ఇలా హత్యకు కుట్ర, కిడ్నాప్ వంటి కేసుల్లో అఖిలప్రియ సతమతమవుతున్నారు. ఇటు పార్టీకి కూడా చెడ్డపేరు తెస్తున్నారు. దీనిపై గతంలోనే చంద్రబాబు అఖిలప్రియ కు సీరియస్ గా చెప్పారని తెలిసింది. ఇలాగే వ్యవహరిస్తే అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ అగాథంలో పడటం ఖాయం అని ఆమె సన్నిహితులు వాపోతున్నారు . ఇప్పటికైనా అఖిలప్రియ తన వ్యవహారశైలి మార్చుకుంటారో? లేక తన పంధాలోనే వెళతారో చూడాల్సి ఉంది.