అడ్రస్ లేని పవన్…ఎగ్జిట్ పోల్స్ పై నోరెత్తటం లేదే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మొదటి నుండి కొంచెం తేడాగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినపుడు వెంటనే అందరూ మాట్లాడినా పవన్ మాత్రం ఎక్కడా కనిపించరు. అందరూ ఆ సమస్యను మరచిపోతున్న సమయంలో హఠాత్తుగా పవన్ ఎక్కడి నుండో ఊడిపడి ట్విటర్లోనో లేకపోతే మీడియా ముందో అదీ కాకపోతే నేరుగా ఆ సమస్య తలెత్తిన ప్రాంతానికో వెళ్ళిపోయి హడావుడి చేసేస్తారు.

ఇప్పుడు విషయం ఏమిటంటే, ఎగ్జిట్ పోల్స్ విషయమే తీసుకుంటే దేశమంతా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై చర్చలు జరుగుతుంటే పవన్ మాత్రం ఎక్కడా కనిపిచటం లేదు. ఏ టివి చర్చల్లో తీసుకున్నా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే హాట్ టాపిక్ అయిపోయింది. ఇటువంటి సమయంలో పవన్ స్పందన మాత్రం ఎక్కడా కనిపించటం లేదు.

నిజానికి మొన్నటి పోలింగ్ తర్వాత జనసేన పట్టుమని నాలుగు సీట్లు గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీ అభ్యర్ధుల్లోనే కనిపించలేదనుకోండి అది వేరే సంగతి. జనసేన అభ్యర్ధులు గెలవటానికి కాకుండా ప్రధానంగా  వైసిపి గెలుపు అవకాశాలను దెబ్బ కొట్టటమే లక్ష్యంగా పోటీ చేశారని అందరికీ తెలిసిపోయింది. దాంతో జనసేనకు మహా అయితే ఓ రెండో మూడో అసెంబ్లీ సీట్లకన్నా రావనే ప్రచారం అందిరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పవన్ స్పందిస్తారని మీడియా ఎదురుచూసింది. కనీసం ట్విట్టర్ లో అయినా ఏదో ట్వీట్ పెడతారని అనుకుంటే అది కూడా కనబడలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మాట్లాడటానికి ప్రయత్నిస్తే అసలు జనసేన నేతలకు కూడా అందుబాటులో లేరట.