ఎవరి మొహంలో అయినా జీవం కనబడుతోందా ?

పై ఫొటోలో కనిపిస్తున్న వారిలో ఏ ఒక్కరి మొహంలో అయినా జీవం కనిపిస్తోందా ? కనీసం మొహమాటానికి కూడా చంద్రబాబునాయుడు అండ్ కో మొహంలో సంతోషం కనిపించటం లేదు. అవతల వారికి పదవి రావటం మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మొహమాటానికైనా ఎదురుగా ఉన్నపుడు నవ్వు మొహం పులుముకుంటాం.

కానీ పై ఫొటోలో చంద్రబాబు, అచ్చెన్నాయడు, నిమ్మల రామానాయుడు, నందమూరి బాలకృష్ణ కనబడుతున్నారు. సందర్భమేమో ఎంఎల్ఏల ప్రమాణస్వీకారోత్సవం. నిన్నటి వరకూ ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సభలో ఇపుడు జగన్మోహన్ రెడ్డి సిఎంగా మొదట ప్రమాణస్వీకారం చేశారు.

తర్వాత చంద్రబాబే ప్రమాణ స్వీకారం చేశారు. మరి అలాంటపుడు మర్యాద పూర్వకంగా అయినా చంద్రబాబు మొహానికి నవ్వు పులుముకోలేదు. ఎవరో తన ఆస్తులను బలవంతంగా లాగేసుకుంటున్నట్లుగా చంద్రబాబు మొహం పెట్టుకున్నారు. సంతాప సభలో మాట్లాడుతున్నట్లుగా మొహాలు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఫొటో.  నిజానికి ఇది ఏ విధంగాను ఇటు చంద్రబాబుకు కానీ అటు టిడిపికి కానీ మంచిది కాదన్న విషయం తెలిసిందే.

నిజానికి 14వ శాసనసభలో జగన్ ను ప్రధాన ప్రతిపక్ష నేతగానే  చంద్రబాబు  అంగీకరించలేకపోయారు. అందుకనే మందిబలం ఉందన్న ఏకైక గర్వంతో జగన్ ను నానా రకాలుగా అవమానించారు. సరే మొన్నటి ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటితో గెలిచినప్పటి నుండి చంద్రబాబుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదు. అందుకనే ఎంఎల్ఏల ప్రమాణస్వీకారోత్సవంలో జీవం లేని మొహం పెట్టుకుని కూర్చున్నారు. ఏం చేస్తా చేసుకున్నవారికి చేసుకున్నంత.