ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో బిజెపి – జనసేన పొత్తు ఎలాంటి ప్రభావం చూయించబోతుంది ? ఈ రెండు పార్టీల కలయికతో పెరిగే ఓట్ల శాతం ఏ మేరకు ఉంటుంది ? అనే ప్రశ్నలెన్నో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం కలిపితే పదిశాతం లోపే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో మూడో ప్రధాన పక్షంగా వీరు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్థానాన్ని చేరుకునేందుకు కమలం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గతానికి భిన్నంగా రాజకీయాలను వేడెక్కిస్తుంది. కేంద్రంలో మోడీ చరిష్మా కి పవన్ సినీ గ్లామర్ తోడైతే తమకు తిరుగులేదన్నది వారి అంచనా.

బీజేపీ – జనసేన ల పొత్తు ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్నది త్వరలో జరగనున్న స్థానిక పంచాయితీ ఎన్నికలు కొంతమేర తేల్చేయనున్నాయి. వాస్తవానికి స్థానిక ఎన్నికలు పార్టీ రహితంగా జరగనున్నాయి. అదీగాక అధికార పార్టీ ఏది ఉంటే దానివైపే ప్రజలు మొగ్గు చూపడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అయితే గ్రామాల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా రెండు గ్రూప్ లే ఎక్కువగా గ్రామాల్లో రాజకీయాలు సాగిస్తుంటాయి. మూడో పక్షానికి అక్కడ ఎక్కువగా స్థానం ఉండదు. కానీ ఈసారి బీజేపీ – జనసేన టీం మూడో పక్షం రూపంలో పంచాయితీ వార్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది.
ఇప్పటికే 151 నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్యెల్యేలదే హవా. వారి కనుసన్నల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరిగే చోట ముక్కోణపు పోటీ ఉంటే అధిక నష్టం టిడిపికే ఉండబోతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే జరిగితే బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం కలిగి ఉన్న టీడీపీకి తీరని నష్టమే కలగనుంది. ఆ నాయకత్వం బలహీనపడితే పార్టీ పునాదులే కదిలే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలటీడీపీ రాజకీయ చరిత్రలో ఎన్నో సంక్షోభాలు చవి చూసింది. అయితే తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉండటంతో ఆ పార్టీ వాటిని అన్ని సమర్ధంగా అధిగమించింది. అధికార ప్రభుత్వం వద్దంటున్నా విపక్షాలన్నీ పట్టుబట్టి మరీ ఈ ఎన్నికలలో ఎవరి బలం ఏంటో తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీలకు, ప్రజలకు త్వరలో ఒక క్లారిటీ రానున్నదని అనుకోవచ్చు.
