ఏపీ పాలిటిక్స్ లో ‘ఐ’ సినిమా డైలాగు పీక్స్!

దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన “ఐ – మనోహరుడు” సినిమా చాలామందే చూసి ఉంటారు. ఆ సినిమాలో తనను ఇబ్బంది పెట్టిన విలన్స్ బ్యాచ్ ను తిరిగి హింసించే క్రమంలో… మీరు నాకు చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇస్తాను అని హీరో అంటే… ‘అంటే చంపేస్తావా’?.. అని విలన్ బ్యాచ్ అడుగుతారు. దానికి సమాధానంగా హీరో చెప్పే మాట… “అంతకు మించి” అని. చావుకు మించిన శిక్ష ఉంటుందా? అంటే… కచ్చితంగా ఉంటుందనే విషయం ఆ తర్వాత సన్నివేశాలు చూసిన తర్వాత అర్ధమవుతుంది!

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… గతంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు, జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఏ స్థాయిలో ఉండేవనే సంగతి తెలిసిందే. ఇక వీరు చేసిన వ్యాఖ్యలకు పలు పసుపు కరపత్రాలు, బాకా బ్యాచ్ చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు!

కట్ చేస్తే… ఈ రెండేళ్ల కూటమి పాలనలో ఏపీలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయిందని చెబుతున్నారు ప్రజానికం. వారితో పాటు ఏపీలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ సంపద సృష్టికర్తగా తన గురించి తాను చెప్పుకునే చంద్రబాబు సైతం బహిరంగంగా ఒప్పుకుంటున్నారు!

వైసీపీ హయాంలో తొలిసారి సీఎం అయిన జగన్ కు కోవిడ్ రూపంలో మహమ్మారి ఎదురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం జగన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ, ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తూ, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు కదిలారు. అయినప్పటికీ… ఏపీని జగన్ సర్కార్ శ్రీలంకగా మారుస్తుంది అంటూ టీడీపీ నేతలు కూయడం, కర పత్రాలు తాటికాయంత అక్షరాలతో అచ్చేయడం తెలిసిందే.

అప్పుడు చంద్రబాబు చెప్పిన మాట… ఏపీలో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూ.. మరిన్ని ఫలాలు అందిస్తానని చెబుతూ.. అందుకు అవసరమైన సంపద ఎలా సృష్టించాలో తనకు తెలుసని. వీటిని చంద్రబాబుతో గతానుభవాలు మరిచిన ఏపీ జనం బాగా నమ్మారు.

కట్ చేస్తే… 50 ఏళ్లు నిండితే చాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు పింఛ‌న్లు ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు సైడ్ అయిపోయారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇంత వ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్క కొత్త పింఛ‌న్‌ ను కూడా మంజూరు చేయ‌లేదని అంటున్నారు. అంటే.. జనం మళ్లీ వెర్రి మాలోకాలయ్యారని చెప్పుకోవచ్చు.

అక్కడితో అయిపోలేదు…! 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కూ నెల‌కు రూ.1,500 ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000 ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్ర‌తి ఏడాదీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌న్న హామీ అమలు పూర్తిస్థాయిలో నోచుకోవ‌డం లేదు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి కూడా కొత్త కొత్త కండిషన్స్ తో తూట్లు పొడిచారని చెబుతున్నారు.

ఈ సమయంలోనే నాడు జగన్ చెప్పిన స్పష్టమైన మాటలను ఏపీ ప్రజానికం గుర్తు చేసుకుంటున్నారని తెలుస్తోంది. నాడు చంద్రబాబు చెప్పిన కబుర్లు, ఇచ్చిన హామీలపై స్పందించిన జగన్… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్య అవన్నీ అమలు సాధ్యం కాదు అని జగన్ స్పష్టంగా చెప్పారు. కానీ జనం మాత్రం చంద్రబాబు హామీలను, సంపద సృష్టి మాటలను నమ్మారు.

కట్ చేస్తే.. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని అంటున్నారు. మరో మూడేళ్లు తప్పదు మరి. అంటే ఈ రెండేళ్ల కంటే అధ్వాన్నంగా పరిస్థితి రాబోయే మూడేళ్లు ఉంటుందా అంటారా..? “అంతకు మించి”… అనేది శూన్యం నుంచి వినిపిస్తోన్న సమాధానం!