క్రేజ్ కా బాప్… ఎన్నికల వేళ వ్యూస్ ఇష్యూ దేనికి సంకేతం?

ఆయా రంగాల్లో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో స్టార్లు ఉన్నా.. ఒక్కరికే భారీ క్రేజ్ ఉంటుంటుంది. ఉదాహరణకు క్రికెట్ లో ధోనీ లాగా! ఇదే క్రమంలో… కొంతమంది దశాబ్ధాల తరబడి ఉంటున్నా వారి మొత్తం క్రేజ్ ని కొత్తగా వచ్చిన వారు సైడ్ చేసి అందనంత దూరానికి వెళ్లిపోతుంటారు. ఈ విషయం రాజకీయాలకూ అతీతం కాదు! ఈ క్రమంలో తాజాగా ఏపీలో వ్యూస్ వార్ నడుస్తోంది!

అవును… సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులు కాస్త విరామం అన్నట్లుగా వేరు వేరు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో భాగంగా.. బుధవారం రాత్రి టీవీ-9లో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ.. టీడీపీ అనుకూల మీడియాగా గుర్తింపు పొందిన ఏబీఎన్ లో చంద్రబాబు ఇంటర్వ్యూ లైవ్ నడిచింది. ఈ రెండు ఇంటర్వ్యూల ప్రసారం ఏకకాలంలో ప్రారంభమైంది.

అయితే ఈ రెండు ఇంటర్వ్యూల్లో ఎక్కువమంది వీక్షకులు జగన్‌ ఇంటర్వ్యూ చూసేందుకే ఇష్టపడ్డారు. టీవీ లోనే కాకుండా… యూట్యూబ్ లో వచ్చే లైవ్ లోనూ అధికంగా ఫాలో అయ్యారు. ఇందులో భాగంగా… టీవీ-9లో జగన్‌ ఇంటర్వ్యూను లైవ్‌ లో అత్యధికంగా 72 వేల మంది చూడగా.. ఇదే సమయంలో ఏబీఎన్ లోని చంద్రబాబు ఇంటర్వ్యూను అత్యధికంగా 20 వేల మంది మాత్రమే చూసిన పరిష్థితి!

ఇదే క్రమంలో గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగానూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఇంటర్య్వూకు సంబంధించిన అనేక వీడియో క్లిప్స్‌ వైరల్‌ గా మారాయి. ఎవరికి వారే చిన్న చిన్న బైట్స్ కట్ చేసుకుని, వాట్సప్ లలో స్టేటస్ లుగా పెట్టుకుంటున్న పరిస్థితి. మరోపక్క చంద్రబాబు ఇంటర్వ్యూ ప్రసారమైనట్లు సోషల్‌ మీడియాలో పెద్దగా చర్చ కూడా జరగడంలేదని అంటున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మరింత జోష్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే వ్యూస్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లతో నెట్టింట చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. ప్రధానంగా జగన్ ఇంటర్వ్యూ లైవ్ వ్యూస్ స్క్రీన్ షాట్లు, చంద్రబాబు ఇంటర్వ్యూకి సంబంధించిన లైవ్ వ్యూస్ ని స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు… టీడీపీ జనాలను ర్యాగింగ్ చేస్తున్నారు!

ఆ సంగతి అలా ఉంటే… వాస్తవానికి బహిరంగ సభల్లో అయినా, తాజా ఇంటర్వ్యూల్లో అయినా గత ఐదేళ్లలో ఏం చేశానో చెబుతూ.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నానో చెబుతూ.. ప్రతీ అంశాన్ని సవివరంగా వివరించారు జగన్. దీంతో జగన్‌ ఏం చెప్తాడో వినాలని ఆసక్తి ప్రజలు చూపారని అంటున్నారు పరిశీలకులు.

ఇక చంద్రబాబు విషయానికొస్తే సుమారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తాను పేదలకు ఏం చేశానో చెప్పుకోలేకపోతున్న పరిస్థితి. సంక్షేమం విషయంలో తన మార్క్‌ ను చూపించడంలో అట్టర్‌ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇంత అనుభవం, ఇంత వయసు వచ్చినప్పటికీ జగన్ పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటున్న దయణీయమైన పరిస్థితిలో బాబు ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఈ విజనరీ విజన్ ఇదంటూ సెటైర్లు పడుతున్నాయి.

పైగా ఇంత కీలకమైన సమయంలో తన అభిప్రాయాలను ప్రజలకు స్పష్టంగా చెప్పి మెప్పించాల్సిన చంద్రబాబు… కేవలం జగన్ ని దుబ్బయట్టడంపైనే పూర్తి శ్రద్ధ వహించారనే చర్చ మొదలైంది. తాము నిన్న ఏమి చేసాము.. రేపు అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే విషయాలు చెప్పకుండా… జగన్ సరిగా చేయలేదు కాబట్టి తన్నకు అధికారం ఇవ్వాలనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు. దీనివల్ల ప్రయోజనం శూన్యం అనే విమర్శలు పరిశీలకుల నుంచి వస్తుండటం గమనార్హం.

ఏది ఏమైనా… ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా… మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. జూన్ 4ల ఫలితాలు రాబోతున్నాయి. ఏమి జరగబోతుందనేది వేచి చూడాల్సిందే!