జగన్ – బాబు మధ్యలో వేమిరెడ్డి పాచిక తూచ్..!

రాజకీయాల్లో తాడిని తన్నేవాడు ఒకడుంటే, వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడని నానుడి. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయివరకూ ఎవరి పాచికలు వాళ్లు వేస్తుంటారు.. అందులో కొన్ని పాచికలు పారతాయి, మరికొన్ని పనిచేయవు.

ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదే… టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ నుంచి తిరిగి వైసీపీలోకి ఆహ్వానం అందిందనే విషయం. అయితే… అసలు వాస్తవం మాత్రం పైన చెప్పుకున్న సామెత మాదిరి మరొకటి ఉందని అంటున్నారు.

ఎన్నికలకు ఇంకా సుమారు మూడేళ్ల కాలవ్యవధి ఉన్నప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో కాలక్రమేణా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా.. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని, అది రెండేళ్లు పూర్తవ్వకుండానే స్పష్టం అయ్యిందని.. అందువల్ల తాము తిరిగి అధికారంలోకి రావడం కన్ ఫాం అని జగన్ ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు.. తమ్ముళ్లు జడుసుకుంటూనే ఉన్నారు! అనంతరం.. చంద్రబాబు & కో రివర్స్ అటాక్ షురూ చేస్తూనే ఉన్నారు. ఇది రొటీన్ ప్రక్రియగా సాగుతోంది.

ఇదే సమయంలో.. పార్టీ వీడిన కీలక నేతల విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారని.. తిరిగి పార్టీలోకి రావాలని వారందరికీ ఆహ్వానాలు పంపుతున్నారని.. దీనికోసం జగన్ తన కోర్ టీం ని రంగంలోకి దింపారని రకరకాల కథనాలొస్తున్నాయి. ఈ కథనాల మాటున తాజాగా వైరల్ గా మారిన ఓ కథనం… ‘నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ కబురు పెట్టించారని, అందుకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని దూతగా పంపారని’.

కట్ చేస్తే… “ఇది జగన్ పంపిన ఆహ్వానమూ కాదు, అయోధ్య రామిరెడ్డి ఈ మేరకు పనిచేసిన దూతా కాదు.. ఇదంతా చంద్రబాబు పై వేమిరెడ్డి సంధించిన ఓ రకంగా బెదిరింపు అస్త్రం”.. అని అంటున్నారు స్థానిక పరిశీలకులు. అంత అవసరం ఏమి వచ్చింది..? అనే ప్రశ్నకూ వారి నుంచి బలమైన సమాధానమే వస్తోంది!

అదేమిటంటే… ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి సైతం టీడీపీలో కీలకంగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదనే విషయం ప్రభాకర్ రెడ్డికి చేరిందని అంటున్నారు.

దీంతో.. బాబుని బ్రతిమాలితే లాభం లేదు.. పార్టీ విడిచి వెళ్లిపోతున్నారన్నట్లుగానో లేక జగన్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయన్నట్లుగానో బెదిరిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని వేమిరెడ్డి భావించారని.. అందులో భాగంగానే మీడియాలో ఈ తరహా అనధికారిక పెయిడ్ కథనాలు ప్రసారం చేయించారని ఓ ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరి ఇందులో ఉన్న వాస్తవాస్తవాల సంగతి అలా ఉంచితే… ఇప్పట్లో జగన్ కు నియోజకవర్గానికి దాదాపుగా ఇద్దరేసి నేతల చొప్పున సిద్ధంగా ఉన్నారని.. పైగా పార్టీ కష్టకాలంలో వారు జగన్ ను విడిచి వెళ్లలేదని.. అవసరాలకు గడపలు మారే వారిని నమ్ముకోవడం కంటే.. కష్టమైనా, నష్టమైనా పార్టీకి విధేయులుగా ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని అధినేత బలంగా భావిస్తున్నారని తాడేపల్లి నుంచి అందుతున్న వేగుల సమాచారం. అదే నిజమైతే… వేమిరెడ్డి తాజా ప్రయత్నమూ వాస్తవమైతే.. ఆయన మరో ఆప్షన్ వెతుక్కోవాల్సిందే..!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… జగన్ నుంచి అయోధ్య రామిరెడ్డి ద్వారా ఆహ్వానం అనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్న సారాంశమూ చంద్రబాబు వద్దకు వెళ్లిందని అంటున్నారు. దీంతో… ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి సంగతి దేవుడెరుగు.. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వీరిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది తమ్ముళ్ల మధ్య చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.