బోండా ఉమకు ఈసారి సీటు “రాధా”?

త్వరలో జనసేనలో చేరిపోతున్నారనే కథనాల నడుమ.. వంగవీటి రాధా, నారాలోకేష్ ని కలిసారు. పాదయాత్రలో పాదంకలిపారు. దీంతో… అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికేసాయని టీడీపీ కేడర్ కాస్త రిలాక్స్ అయ్యింది. ఫలితంగా రాధాపై కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కి కూడా చెక్ పడినట్లయ్యింది. ఆ సంగతులు అలా ఉంటే… “లోకేష్ పాదయాత్రలో రాధ” అనే టాపిక్ ఒక వ్యక్తికి మాత్రం తెగ టెన్షన్ తెప్పిస్తుందట!

అవును… రాధా టీడీపీని వదలడం లేదని, జనసేనలో చేరడం లేదని, టీడీపీ అధినేతలతో మాంచి సంబంధాలే ఉన్నాయని నిరూపణ అయ్యింది. కానీ.. ఈ విషయంలో బోండా ఉమ కు టెన్షన్ తెప్పిస్తుందని అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే… విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు తప్ప మరేది రాధ ఆడగరు!

గతంలో దివంగత వైఎస్సార్ నాయకత్వంలో రాజకీయ అరంగేట్రం చేసిన రాధా… విజయవాడ సెంట్రల్ నుంచే పోటీచేశారు. అనంతరం ఆ సీటూ ఇవ్వలేమన్నందుకే జగన్ ని వీడారు. తర్వాత టీడీపీలో చేరినా కూడా ఆ సీటును చంద్రబాబు ఇవ్వకపోయే సరికి.. మరెక్కడా పోటీచేయకుండా ఉండిపోయారు. దీంతో.. ఈసారి చంద్రబాబు కచ్చితంగా రాధకు విజయవాడ సేంట్రల్ ఇచ్చి తీరతారని అంటున్నారు రాధా ఫ్యాన్స్!

దీంతో… గత ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో కేవలం పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయి బోండా ఉమ టెన్షన్ లో పడిపోయారంట. గతంలో రాధా త్యాగం చేశారు కాబట్టి.. ఈసారి త్యాగం వాటా తనకు వస్తుందేమో అనేది ఆయన వర్గీయుల్లో నెలకొన్న ఆందోళన అని అంటున్నారు!

మరి రాధాకు ఈ సీటు కన్ ఫర్మ్ చేసేస్తే… బోండా ఉమా పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న! తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీగా చేస్తామని బోండా ఉమాకు హామీ బాబు ఇవ్వవచ్చు అని అంటున్నారు. అయితే తనకు భారీ ఎత్తున క్యాడర్ ఉండి, అనుచరగణం ఉన్న బోండా ఉమా.. ఎమ్మెల్సీ సీటు హామీతో వెనక్కు తగ్గుతారా లేదా అన్నది చూడాలి! అది కూడా… టీడీపీ అదికారంలోకి వస్తేనే! దీంతో.. రాధ ఎఫెక్ట్ బోండాపై గట్టిగానే పడేట్లుందే అని తమ్ముళ్లలో చర్చ నడుస్తుంది!