అలా చేసి ఉంటే బాగుండేదిగా పవన్.. ఏడాదిలో సాధ్యమయ్యే పనేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్న విధానం సరైనదేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలై దాదాపుగా ఏడు నెలలైంది. ఈ ఏడు నెలలలో పవన్ నటించాల్సిన ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే పవన్ మాత్రం రాబోయే తొమ్మిది నెలల్లో ఏకంగా మూడు సినిమాలలో నటిస్తానని చెబుతున్నారు. పవన్ గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇది సాధ్యం కాదని చెబుతున్నారు.

పవన్ షూటింగ్ లలో మాత్రమే పాల్గొంటే సరిపోదు. సినిమాల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటే మాత్రమే సినిమాలకు బెనిఫిట్ కలుగుతుంది. పవన్ సినిమాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించకపోతే హరిహర వీరమల్లు షూటింగ్ తో పాటు వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ మాత్రమే పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు కూడా ఆలస్యమైతే పవన్ కేవలం ఆరు నెలలు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఉంటే ఈ విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ పవన్ అనుకున్న ప్రకారం షూటింగ్ లను పూర్తి చేసినా నాలుగేళ్ల పాటు సమస్యలను పట్టించుకోని పవన్ ను ప్రజలు నమ్ముతారని చెప్పలేం. రెండు పడవల ప్రయాణం వల్ల పవన్ కళ్యాణ్ కు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఒక్కో ప్రాజెక్ట్ కు పవన్ 70 కోట్ల రూపయల పారితోషికం తీసుకుంటున్నారు.

రాజకీయ అవసరాల కోసమే డబ్బులు ఖర్చు చేస్తున్నానని ఆయన చెబుతున్నా ప్రజల్లో చాలామంది మాత్రం పవన్ మాటలను పూర్తిస్థాయిలో విశ్వసించడం లేదు. 2019 ఎన్నికల్లో పార్ట్ టైమ్ రాజకీయాల వల్లే పవన్ కళ్యాణ్ నష్టపోయారని చాలామంది భావిస్తారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే పొరపాటు చేస్తుండటంపై కొంతమంది నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ లను పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాలపై పవన్ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.