థాంక్యూ జగన్… ఇట్లు మీ నందమూరి తారకరామారావు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబడ్డ సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లోనే ఉంటారు! అయితే తమ కస్టడీకి ఇవ్వాలని తాజా సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు అరెస్టుపై ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి.

చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఆదివారం (సెప్టెంబర్ 10) న అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నందమూరి తారకరామారావు ఆత్మ సంతోషిస్తుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో “థాంక్యూ జగన్… నా ఆత్మకు శాంతి చేకూర్చావు” అని సీనియర్ ఎన్టీఆర్ చెబుతున్నట్లు ఒక ఫ్లెక్స్ ఇప్పుడు తెరపైకి వచ్చి హల్ చల్ చేస్తుంది.

జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్న ఒక ఫ్లెక్స్ వైరల్ గా మారింది. ఇందులో జగన్ కు హరికృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ కలిసి పుష్పగుచ్చం ఇస్తున్నట్లు ఫోటో ఉండగా… తమ కుటుంబంలోని మరణాలను చంద్రబాబు రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారో సీనియర్ చెబుతున్నట్లు మేటర్ ఉంది.

“నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి, నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకుని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడుకుని, చివరకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచరాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ది చెప్పి నా ఆత్మకు శాంతిని చేకూర్చావు”

“నీచుడూ, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబరు 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును (సెప్టెంబర్ 10) ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి… ఇట్లు… నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)” అని ఆ ఫ్లెక్స్ లో మేటర్ రాసి ఉంది! దీంతో ఈ ఫ్లెక్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.