జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో నాలుగు జనసేన పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. మెదక్, వరంగల్, నల్లగొండ, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం స్థానాలకు కమిటీలను వేశారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటి చేసేందుకు జనసేన పార్టీ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయలేదు. వాస్తవానికి తెలంగాణలో 25 అసెంబ్లీ స్థానాలకు పోటి చేయాలని భావించినట్టు పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రకటించారు. కానీ పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం మరియు పొత్తుల పై క్లారిటి లేకపోవడంతో పోటి చేయలేకపోయామని పవన్ అన్నారు.
ఆ తప్పులు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో జరగకూడదనే ఉద్దేశ్యంతో జనసేన ముందు జాగ్రత్తగా కమిటీలను ప్రకటిస్తుంది. ఏపీలో వామపక్షాలతో కలిసి పోటి చేస్తామన్న పవన్ తెలంగాణలో ఎవరితో కలిసి పోటి చేస్తారనే దాని పై స్పష్టతనివ్వలేదు.
