మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసిలకు కాంగ్రెస్ గుడ్ న్యూస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిలకు తీపి కబురు అందిచబోతున్నది. ఈ విషయాన్ని మేనిఫెస్టో లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా చర్చలు జరిపింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ. మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న విధంగానే వారికి కూడా వెసులుబాట్లు కల్పించేందుకు చర్చిస్తున్నది.

గాంధీభవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో ఛైర్మెన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,సభ్యులు ఉత్తం పద్మావతి  రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మేనిఫెస్టో లో పొందుపర్చే అంశాల పై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కు తుది రూపు ఇచ్చే పనిలో పడ్డారు మేనిఫెస్టో కమిటీ సభ్యులు. 

శనివారం మేనిఫెస్టో కమిటీ సమావేశం తర్వాత నాయకులు దామోదర రాజనర్సింహ్మ, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారు చెబుతున్న వివరాలివి. 

కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన హామీ లతో పాటు తెలంగాణ ప్రజలకు ఇంకా ఎలా అండగా ఉండాలనేది దానిపై చర్చిచాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. అమరవీరుల త్యాగాల గుర్తుగా ఓక స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చినట్లు బీసీ లు కూడా కావాలని కోరారు.. ఈ విషయం కూడా చర్చించాం. చేనేత కార్మికుల రుణమాఫీ, లోన్ లు విషయం కూడా చర్చించ్చాం. 

ఇసుక విధానం పై కూడా చర్చిచాం. పక్క రాష్రం లో లోటు బడ్డెట్ అయినా ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటి ఆలోచనే చేస్తున్నాం. మాజీ ఏమ్మెల్యే లు, మాజీ ఏంపీ లకు పెన్షన్ ఇచ్చినట్లే మాజీ ఏంపీటిసిలు, మాజీ సర్పంచుల కు పెన్షన్ ఇచ్చే విషయమై చర్చిస్తున్నాం. కేసీఆర్ మేనిఫెస్టో మోసాలతో కూడుకున్నది. మాది వాస్తవాలతో కూడుకున్నది.

మా మేనిఫెస్టో ను ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్ చేస్తాం. ఓటమి భయం తో టిఆర్ఏస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్దం కావట్లేదు. పైన కట్టే ప్రాజెక్టు లను చంద్రబాబు ఎలా ఆపుతాడు, ఇదందా అబద్ధపు ప్రచారం. మహిళా మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపిన వారు మా గురించి మాట్లాడితే జోక్ లా అనిపిస్తున్నది. 

మా గోడు ఆలకించండి : మాజీ సర్పంచ్ లు, మాజీ జెడ్పీటిసిలు 

సర్పంచ్ గా, ఎంపిటిసిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత తమను గౌరవించే పరిస్థితే లేదని మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిల సంఘం నేతలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే అన్ని పార్టీల నేతలను తమ సమస్యలను తమతమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని కోరారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ నర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిల సంఘం నేతలు

వారి విన్నపం మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ దీనిపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. వారి విన్నపాన్ని స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లకు, మాజీ ఎంపిటిసిలకు సైతం ఎంపి, ఎమ్మెల్యేలు రిటైర్ అయితే పెన్షన్ వచ్చినట్లు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వబోతున్నది.