జనసేన మీద టీడీపీ జుగుప్సాకర దాడి.!

జనసేన బలపడితే వైసీపీకి మంచిదే.! కానీ, జనసేన బలపడటమంటే టీడీపీకి మరణ శాసనం.! ఇది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. జనసేన వల్ల వచ్చే ఓట్లు టీడీపీకి అవసరం. అదే సమయంలో, జనసేన పార్టీ మాత్రం సొంతంగా బలపడకూడదు. ఇదీ చంద్రబాబు వ్యూహం.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. కింది స్థాయిలో బలమైన క్యాడర్ తయారవుతోంది జనసేన పార్టీకి. అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, జనసేన విజయావకాశాల్ని ఎంతవరకు దెబ్బ తీస్తాయి.? అన్నది వేరే చర్చ.

జనసేన బలపడితే, రేప్పొద్దున్న పొత్తుల చర్చల సమయంలో జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించాల్సి రావొచ్చు. అందుకే, తన అను‘కుల’ మీడియా ద్వారా జనసేన మీద దాడిని తీవ్రతరం చేసింది తెలుగుదేశం పార్టీ. జనసేనకు వేరే దారి లేదనీ, సీట్ల లెక్కలేసుకోకుండా టీడీపీకి మద్దతివ్వాలనీ, వైసీపీని దించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని జనసేనకు సూచిస్తోంది టీడీపీ అను‘కుల’ మీడియా.

వైసీపీ నుంచి జనసేన మీద విమర్శలు రావడం సహజమే. కానీ, టీడీపీ నుంచి జనసేన మీద జుగుప్సాకరమైన విమర్శలు రావడమే హాస్యాస్పదం. టీడీపీ అర్థం చేసుకోవాల్సందేంటంటే.. జనసేన మీద ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఈ దాడి.. 2024 ఎన్నికల్లో టీడీపీని సర్వనాశనం చేస్తుందని. అన్నట్టు, ‘ఈసారికి ఒంటరిగానే వెళదాం.. టీడీపీ ఖేల్ ఖతం అయిపోవడం ముఖ్యం..’ అని జనసైనికులు, జనసేన అధినేతకు సోషల్ మీడియా సహా పలు ఇతర మార్గాల్లో సూచిస్తున్నారు.