టీడీపీకి పదిహేను ఎంపీ సీట్లు.! నమ్మేలా వుండాలి కదా బుజ్జీ.!

తెలుగుదేశం పార్టీకి ఏకంగా పదిహేను సీట్లు వచ్చేస్తాయట వచ్చే ఎన్నికల్లో.! జనసేన పార్టీకి ఆరు నుంచి ఏడు వరకు ఎంపీ సీట్లు రావొచ్చట. ఈ రెండు పార్టీల ఎన్డీయే కూటమిలో భాగమవుతాయట. అలాగని, ఓ నేషనల్ మీడియాకి చెందిన ఓ సంస్థ సర్వే ఫలితాల్ని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రమేంటో అందరికీ తెలుసు. విపక్షాలు కిందా మీదా పడుతున్నాయిగానీ, హైప్ రావడంలేదు వాటికి. అధికార వైసీపీ, ప్రస్తుతానికైతే చాలా బలంగా వుంది. వైసీపీ చేసే తప్పిదాలే, విపక్షాలకు వరంగా మారనున్నాయి.

గతంలో పలు సర్వేలు ఏపీ రాజకీయాల గురించి బయటకు రావడం చూశాం. ‘వైనాట్ 175’ అనే వైసీపీ నినాదానికి అనుకూలంగానే ఆ సర్వేల ఫలితాలు వచ్చాయి. కానీ, ఈసారి ఫలితం కాస్త భిన్నంగా వచ్చింది. కాస్త కాదు.. చాలా చాలా భిన్నంగా.!

వైసీపీకి, ఎంపీ సీట్లు కేవలం సింగిల్ డిజిట్ మాత్రమేనా.? అది కూడా, ఐదు లోపలేనా.? అన్న విషయమై విపక్షాల్లోని నేతలే ఆఫ్ ది రికార్డుగా ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఔనా.? మా పార్టీకి ఆరు ఎంపీ సీట్లు వచ్చేస్తాయా.?’ అని జనసేన శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీడీపీ సంగతి సరే సరి.!

ఏమో, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నిజంగానే మారబోతోందేమో.! తప్పు పట్టేయడానికి వీల్లేదు ఈ సర్వేని. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కానీ, విపక్షాల నుంచి ఎంపీలుగా గెలిచే అవకాశం వున్న ఆ నాయకులెవరు.? టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు.. ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇప్పటిదాకా అసలు ఏమాత్రం స్పష్టతతో లేవాయె.

టీడీపీ అనుకూల మీడియా ఎలివేషన్లు ఇచ్చినా, వైసీపీ లైట్ తీసుకుంటున్నా.. ఈ తరహా సర్వేలు వస్తూనే వుంటాయ్.!