జనసేనను విమర్శిస్తే వైసీపీకి లాభమేంటి.?

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుందన్నదానిపై స్పష్టత లేదు. టీడీపీ – జనసేన కలుస్తాయా.? లేదా.? అన్నదానిపైనా భిన్న వాదనలున్నాయి. మరి, వైసీపీ ఎందుకు జనసేనని చూసి ఆందోళన చెందాలి.?

2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అదే ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీని చూసి భయపడుతోందంటే, నమ్మగలమా.? కానీ, ఇదే నిజం. ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా ఎప్పుడో వైసీపీలోకి దూకేశారు. జనసేన ఇప్పుడు నిజానికి ‘జీరో’. ఆ జీరో పార్టీని చూసి, నూట యాభై ప్లస్ అసెంబ్లీ సీట్లున్న వైసీపీ భయపడుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌ని వదిలి ఏపీకి వస్తున్నాడంటే చాలు, వైసీపీలో మంత్రుల దగ్గర్నుంచి, ఇతర కీలక నేతలంతా మీడియా ముందు హాజరైపోతారు. ఎడా పెడా ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. ఇక, సోషల్ మీడియాలో అయితే వైసీపీ మద్దతుదారులు పెద్ద యుద్ధమే చేస్తారు. లక్షల్లో కాదు, కోట్లలో ఖర్చవుతుందేమో దీనికి.!

ప్రతిసారీ ఇదే తంతు.! అసలు జనసేన వల్ల వైసీపీకి వచ్చే నష్టమేంటి.? భవిష్యత్తులో నష్టం రావొచ్చేమోనని వైసీపీ ముందే కంగారు పడుతోందేమో.! నిజానికి, వైసీపీ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కానీ, అధినేత మెప్పు కోసం కొందరు వైసీపీ నేతలు ఇలా కంగారు ప్రదర్శిస్తుంటారంతే. జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో జనసేనాని ఆంధ్రప్రదేశ్‌లో హడావిడి చేస్తున్నారు. జస్ట్ ఓ రెండు మూడు రోజుల హడావిడి అంతే. ఆ తర్వాత అంతా మామూలే. జనసేన కంటే ఎక్కువ హడావిడి పడుతోంది వైసీపీ.. పవన్ కళ్యాణ్ ఏపీ ‘ట్రిప్’ సందర్భంగా.! అవసరమా ఇదంతా.?