Lakshmi Priyanka: వైసీపీకి విశాఖలో మరో షాక్‌: అవంతి కుమార్తె రాజీనామా!

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ వేడి పెరుగుతోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె. ఈ పరిణామం అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

లక్ష్మీ ప్రియాంక తన రాజీనామా లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నానని, ఇప్పటివరకు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమేనా, లేక రాజకీయంగా ముందస్తు వ్యూహమా అన్న చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను కోల్పోయిన వైసీపీ, విశాఖ మేయర్ పదవిని నిలుపుకోవాలనే ఆలోచనతో కార్పొరేటర్లను బయట క్యాంప్‌లకు తరలించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, పార్టీ నేతల్లో అసంతృప్తి ఎంత దూరం వెళ్లిందో స్పష్టమవుతోంది. మరికొందరు కూడా పార్టీకి రాజీనామా చేస్తారా? అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఈ అవిశ్వాస తీర్మానం చుట్టూ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. టీడీపీ కుట్రలను అడ్డుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీలో మెజార్టీ లేకపోయినా టీడీపీ అవిశ్వాసం పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. కానీ లక్ష్మీ ప్రియాంక రాజీనామా తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినట్టు కనిపిస్తోంది.

కూటమి మళ్లీ అవే తప్పులు || AP Government Plans to Increase Electricity Charges || Chandrababu || TR