ఎవరి దారి వారిదే..సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న విధంగానే దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వై ఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన తండ్రి పేరుతో తెలంగాణలో ఆమె పార్టీని ప్రారంభించబోతున్నారు. ఈ రోజు నుంచి వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు.

మరోవైపు లోటస్ పాండ్ లోని కార్యాలయం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తో మీకు విభేదాలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. తమ పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ వైసీపీ విభాగంతో కలసి పని చేస్తానని తెలిపారు.

తమ మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా తన దారి తనదేనని అన్నారు. తెలంగాణ అంశాల వరకే తమ పార్టీ పరిమితమవుతుందని చెప్పారు. మరోవైపు షర్మిల అభిమానులు మాట్లాడుతూ, పార్టీ పెట్టాలనే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. షర్మిల ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు.