ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ ఈ సీ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల్ని నిర్వహిస్తామన్నారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగిస్తే ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదంటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు.
అయితే ఇంతకంటే ముందు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారుల తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. జాయింట్ కలెక్టర్లకు చార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని ఎస్ఈసీ ఆదేశించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీల తొలగించారు. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐల తొలగించారు. తొలగించిన వారి స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే ప్రస్తుతం అధికారులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ విధుల్లో ఉన్నారని కొత్త అధికారుల పేర్లు పంపలేమని సీఎస్ చెప్పుకొచ్చారు.