
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రంలో రోడ్లపై గుంతలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘అవి చంద్రబాబు హయాంలో పడిన గుంతలు.. వాటిని చంద్రన్న గుంతలనడం సబబు. ఆ గుంతల పేరుతో టీడీపీ రాజకీయం చేయడం తగదు. రోడ్లను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు..’ అని సెలవిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే, చంద్రబాబు హయాంలో రోడ్లకు గుంతలు పడితే, రెండేళ్ళలో ఆ గుంతల్ని పూడ్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకోకపోవడమేంటి.? ఇంకో మూడేళ్ళపాటు చంద్రన్న గుంతల్ని అలాగే వదిలెయ్యడానికే ప్రభుత్వం నిర్ణయించుకుందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు, పాలన ఎలా వున్నా, కొంతమంది వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి చేస్తున్న నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తోంది. రోడ్లపై గుంతలకు సంబంధించి చంద్రన్న గుంతలంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో చాలా రహదార్లు గడచిన రెండేళ్ళలో అత్యంత దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ గుంతల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతూ వస్తోంది. రోడ్లపై గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సంగతినీ చూస్తున్నాం. ఈ గుంతల విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకింత బాధ్యతాయుతంగా మాట్లాడి వుంటే బావుండేదేమో. గత కొద్దిరోజులుగా టీడీపీ శ్రేణులు, రోడ్లపై గుంతల్లో చేపల్ని వదులుతుండడం, వరి నాట్లు వేస్తుండడం ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
