భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి సోమవారం సాయత్రం రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ పదవీ కాలం 2019 సెప్టెంబరు వరకు ఉంది. కానీ 11 నెలలకు ముందుగానే ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతున్నది.
కానీ ఆయన రాజీనామా చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉర్జిత్ పటేల్ హయాంలోనే కేంద్ర సర్కారు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. కానీ నోట్ల రద్దు నిర్ణయం పెద్దగా దేశానికి మేలు చేకూర్చలేదన్న విమర్శలున్నాయి. కానీ జనాలను మాత్రం ఈ నిర్ణయం ముప్పు తిప్పలు పెట్టింది. క్యూ లైన్లలో నిలబడలేక జనాలు అవస్థలు పడ్డారు. డబ్బు చెలామణిలో లేకపోవడంతో తల్లడిల్లిపోయారు. వందకు పైగా నోట్ల రద్దు మరణాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. అంత జరిగినా ఏ లక్ష్యం కోసమైతే నోట్ల రద్దు నిర్ణయం జరిగిందో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
నోట్ల రద్దు నిర్ణయం అమలు చేసింది మాత్రం ఉర్జిత్ పటేల్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఉర్జిత్ పటేల్ కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తూ వస్తున్నారు. బిజెపి సర్కారుతో పొసగకపోవడంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు గుసగుసలు మొదలయ్యాయి.
అసలు ఉర్జిత్ పటేల్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారన్నదానిపై ఆర్బీఐ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాను ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినందుకు గర్వపడుతున్నానని రాజీనామా సందర్భంగా ఉర్జిత్ పటేల్ కామెంట్ చేశారు. ఉర్జిత్ 2016 నుంచి ఆఱ్బీఐ గవర్నర్ గా విధుల్లో ఉన్నారు. క్లిష్ట సమయంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం బిజెపికి కొంత ఇబ్బందికరమైన పరిణామంగానే చెబుతున్నారు.
మొన్నటికి మొన్న దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ లో లుకలుకలు ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. సిబిఐ లో డైరెక్టర్ల లంచగొండితనం, అశ్రిత పక్షపాతం ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. దీంతో సిబిఐ అభాసుపాలైంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే సిబిఐ వారి చెప్పు చేతుల్లో పనిచేస్తున్నదని వస్తున్న విమర్శలకు బలం చేకూరింది. సిబిఐ పరిణామాలతో బిజెపి ఇరకాటంలో పడితే తాజాగా ఉర్జిత్ రాజీనామా మరో ఇరకాటం తెచ్చిపెట్టింది.
సిబిఐ విషయంలో వివాదం రేగడంతో చంద్రబాబు సర్కారు వ్యూహాత్మక అడుగులు వేసింది. ఎపిలో సిబిఐ కి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఆమె బాటలోనే మమతా బెనర్జీ కూడా సిబిఐ కి పశ్చిమ బెంగాల్ లో నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాలపై పెద్దగా వ్యతిరేకత రాలేదు. దానికి కారణం సిబిఐ అభాసుపాలు కావడమే. అయితే సిబిఐ ని గాడిలో పెట్టేందుకు బిజెపి సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరి ఇప్పుడు ఉర్జిత్ పటేల్ రాజీనామా ఎలాంటి పరకంపణలు లేపుతుందోనని టాక్ మొదలైంది.