జగన్ ట్వీట్ పై అద్నాన్ సమీ… కళ్లు తెరవమంటున్న నెటిజన్లు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ పై సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం తెలిపారు. దీంతో అద్నాన్ ది అజ్ఞానమా.. అమాయకత్వమా.. అంటూ సోషల్ మీడియా జనాలు ఒక రేంజ్ లో వాయించేస్తున్నారు. నీతులు చెప్పే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని.. గురివింద కబుర్లు మానుకోవాలని అద్నాన్ కి సూచిస్తున్నారు.

వివరాల్లోకి వస్తే… రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందాన్ని ప్రధాని నుంచి మొదలు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా రాజమౌళి బృందాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. “నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం హర్షణీయం. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడించారు. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకొనే తెలుగు పాట పట్ల గర్వపడుతున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది తెలుగు ప్రజలను, భారతీయులందరికీ గర్వకారణం చేసినందుకు ఆర్.ఆర్.ఆర్. చిత్ర బృందానికి అభినందనలు” అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన అద్నాన్ సమీ.. కోడిగుడ్డుపై ఈకలు పీకే పనికి పూనుకున్నారు. అవును… జగన్ చేసిన ట్వీట్ కు ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్.ఆర్. చిత్రానికి అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే గర్వకారణం కాదని, దేశానికే గర్వ కారణమని అద్నాన్ సమీ పేర్కొన్నాడు. అక్కడితో ఆగని ఈ విశాల హృదయం ఉన్న దేశభక్తుడు… “సీఎం జగన్ ప్రాంతీయ విభజనలను సృష్టించినందుకు, దేశీయంగా ఈ ఆత్మగౌరవాన్ని తీసుకోలేనందుకు సిగ్గు పడుతున్నా..” అని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.

దీంతో కీబోర్డ్ కి పనిచెప్పిన నెటిజన్లు… “తెలుగు రాష్ట్రాలకు మాత్రమే గర్వకారణం కాదని అంతాభావిస్తే.. బాలీవుడ్ స్టార్స్ ఏందుకు వెంటనే స్పందించలేదు.. తమ అభినందనలు తెలపలేదు? అక్కడే వున్నవుగా.. ఒకసారి వాళ్లను కనుక్కుని ట్వీట్ చెయ్యి” అంటూ ట్వీట్ చేశారు ఒక నెటిజన్.