జనసేన పార్టీకి అంజనా దేవి విరాళం

పవన్ కల్యాణ్ తల్లి  శ్రీమతి కొణెదల అంజనాదేవి జనసేన పార్టీకి భూరి విరాళం అందించారు. ఆమె  నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందచేశారు.

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారంనాడు ఈ మేరకు చెక్కును పార్టీ అధ్యక్షుడు, ఆమె కుమారుడు పలన్ కల్యాణ్ కు అందచేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి అంజనాదేవి తనను కలసిన జనసేన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ తనెందుకు విరాళమిచ్చారో చెప్పారు. 

పోలీస్ వుద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని తన కుమారుడు  పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు చెప్పారు. ఎందుకంటే పోలీస్ వుద్యోగం తనకు బాగా తెలుసునని, తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారని, తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసేవారని ఆమె చెప్పారు. తన తండ్రిగారి వుద్యోగం రీత్యా తాము పశ్చిమ గోదావరి జిల్లాకు మారినట్లు చెబుతూ ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పనిచేసే  కొణెదల వెంకట్రావు తో తనకు వివాహం అయిందని, ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా  వెంకటరావు  రిటైర్ అయినట్లు శ్రీమతి అంజనా దేవి గుర్తుచేసుకున్నారు.

వెంకట్రావు గారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందించినట్లు  ఆమె ఆనందంతో చెప్పారు.

 అంతకు ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన  మాతృమూర్తికి  పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛము ఇచ్చి సాదరంగా ఆహ్వానించి ఆమె పాదాలకు నమస్కరించారు.
పార్టీ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీమతి అంజనాదేవికి నమస్కరించగా…ఆయన తండ్రి  నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వు కారణంగా తన కుటుంబానికి కలిగిన మేలును గుర్తుచేసుకున్నారు.

 ఎన్ .టి.రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించగా,  నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే వయోపరిమితిని 58 ఏళ్లకు పెంచారని, దీని కారణంగా తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కలిగిందని ఆ మె చెప్పారు.

 

JanaSena Chief Pawan Kalyan's Mother Anjana Devi Garu Donates 4 Lakhs to JanaSena Party | Hyderabad