జనసేన అధినేత పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం దాదాపు ఫైనల్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. ‘ఏదో ఒకటి తొందరగా ఫైనలైజ్ చేసేస్తే, పార్టీ శ్రేణులు ఆ నియోజకవర్గంలో తమ పని తాము చేసుకుంటాయ్..’ అని ఇటీవల హైద్రాబాద్‌లో జనసేనానితో భేటీ అయిన జనసేన ముఖ్య నేతలు, తమ అధినేత ముందు ఓ ప్రతిపాదన పెట్టారని తెలుస్తోంది.

గాజువాక, భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తిరుపతి.. ఇలా పలు నియోజకవర్గాల పేర్లు జనసేన పరిశీలనలో వున్నాయి.. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గానికి సంబంధించి. వీటిల్లో గాజువాక నియోజకవర్గంపై జనసేనాని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

‘గతంలో ఓడిపోయారు కదా.. ఇప్పుడు ఇంకోసారి ఎందుకు అక్కడే పోటీ.?’ అంటూ కొందరు నేతలు అధినేతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, స్టీలు ప్లాంటు వ్యవహారంలో జనసేనాని ఎటూ తేల్చుకోలేకపోతోంది మిత్రపక్షం బీజేపీ కారణంగా. సో, ఆ ప్రభావం, ఆ నెగెటివిటీ ఖచ్చితంగా జనసేనాని మీద గాజువాక నియోజకవర్గంలో వుంటుంది.

అయితే, అప్పటికి పరిస్థితులు మారతాయనీ, ఓడినచోటే బంపర్ మెజార్టీతో గెలిస్తే, అందరి నోళ్ళూ మూతపడతాయని జనసేనాని భావిస్తున్నారట. అయితే, భీమవరం సంగతేంటి.? అంటే, భీమవరం నుంచి ఓ సినీ ప్రముఖుడు పోటీ చేస్తారని జనసేన అధినేత, పార్టీ శ్రేణులకు చెప్పినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాతి నుంచి టిక్కెట్లు ఖరారు చేసే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నారట జనసేనాని. అందరికన్నా ముందు తన విషయమ్మీదనే ఆయన జనంలోనే స్పష్టత ఇస్తారని సమాచారం.