ద్వారంపూడిపై తొడకొట్టిన పవన్… జగన్ పై సంచలన వ్యాఖ్యలు!

వారాహి యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… తాజాగా కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంలో శృతిమించి చేశారని కొందరంటుంటే… ప్రస్తుత రాజకీయాల్లోని విమర్శల్లో పరిధులు ఏమున్నాయని మరికొందరు అంటున్నారు.

తాజాగా సర్పవరం జంక్షన్ లోని సభలో పవన్ ప్రసంగం మొత్తం… స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్రంగానే కొనసాగింది. ఇందులో భాగంగా మైకందుకున్న పవన్… “ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డీ.. నీకు రోజులు దగ్గరపడ్డాయి లెక్కపెట్టుకో.. సభాముఖంగా చెబుతున్నా.. ఈ క్లిప్పింగ్‌ కట్‌ చేసి మీ నాయకుడికి పంపించుకో.. మీ నేరసామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తా.. మీ జగన్‌ మోహన్‌ రెడ్డిని రోడ్డుమీదకి తీసుకొస్తా.. నీ సంగతీ చూస్తా. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు.. ఇకపై ఆడపిల్లల జోలికి వచ్చినా.. ఆడపిల్లల్ని బెదిరించినా.. మీ తాతకు చేసినట్టుగా నిన్ను బేడీలేసి లాక్కెళ్తాం. మీ తాతను డీటీ నాయక్‌ తీసుకెళ్తే.. నీకు బీమ్లానాయక్‌ ట్రీట్మెంట్‌ నేనిస్తా. నీ క్రిమినల్‌ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే.. నా పేరు పవన్‌ కల్యాణ్‌ కాదు.. మా పార్టీ జనసేన కాదు!”

ఇవి ఒకరేంజ్ లో ఫైర్ అయిన పవన్ కల్యాణ్.. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు. ఇవి చాలు ద్వారంపూడిని జనసేన ఏ రేంజ్ లో టార్గెట్ చేసిందో చెప్పడానికి.

ఈ సందర్భంగా కన్నబాబు, తోట త్రిమూర్తులపై పవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా విమర్శలు గుప్పించారు. “కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేస్తున్నారు? ఏదైనా మాట్లాడితే కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబు బాధపడతాడు. మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా దురదృష్టం.. తప్పుచేశాం” అని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా… సీఎం జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసి గుండెపోటు అని సీన్ క్రియేట్ చేశారని, అంతా హార్డ్ కోర్ క్రిమినల్స్ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన రోజున క్రిమినల్ నాయకులందరికీ చెమడాలు వలిచేస్తానని, వీధి వీధి తిప్పుతూ తన్ని తన్ని తీసుకెళ్తానని.. వైసీపీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని పవన్ శపథం చేశారు.