మీకు మీరే మాకు మీమే… పవన్ నయా టార్గెట్ ఫిక్స్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే “సిద్ధం”, “మేమంతా సిద్ధం” అంటూ జనల్లోకి వచ్చేశారు జగన్. మరోపక్క “ప్రజాగళం” అంటూ చంద్రబాబు ప్రచారానికి తెరలేపారు. ఈ సమయంలో ఈనెల 30 నుంచి పిఠాపురంలో జనసేనాని “వారాహి యాత్ర” చేపట్టనున్నారు. ఈ క్రమంలో సుమారు మూడు రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నారు. అనంతరం ఏప్రిల్ 4 నుంచి ఇతర నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం ఉండబోతోంది. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.

అవును… ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టబోయే పవన్… పిఠాపురం పర్యటన అనంతరం షెడ్యూల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4 నుంచి ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో పర్యటించబోతున్నారంట. ఈ క్రమంలో 4 నుంచి 7 వరకూ ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ ప్రచారం ఉంటుందని చెబుతున్నారు.

పొత్తులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేనకు ఆరు సీట్లు దక్కాయి. అవి… విశాఖ జిల్లాలోని విశాఖ సౌత్, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి.. కాగా… శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం. ప్రధానంగా ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా… ఈ ఆరు నియోజకవర్గాలను మాత్రమే కవర్ చేయాలని పవన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం వారాహి వాహనంపై ఉంటుందా.. లేక కార్ సన్ రూఫ్ వద్ద నిలబడి కానిచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది!

ప్రచారం ఎలా సాగినా కానీ… జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే పవన్ ప్రచారం ఉండబోతుందని మాత్రం చెబుతున్నారు. ఇదే సమయంలో గోదవారి జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ పవన్ పర్యటన ఏప్రిల్ నెలలోనే రెండు, మూడు వారాల్లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ గ్యాప్ లో ఉమ్మడి సభల్లోనూ పాల్గొంటారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో… కనీసం కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అయినా పవన్ ప్రచారం ఉంటుందని భావించినవారు మాత్రం పెదవి విరుస్తున్నారని తెలుస్తుంది. దీంతో… మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్… తనతో పాటు తన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తుండటం మాత్రం ఆసక్తిగా మారింది. మరి ఈ 21 స్థానాల్లో జనసేనాని ఎన్ని స్థానాలు సంపాదించుకుంటారనేది వేచి చూడాలి!!