ఎన్నికలకు ముందు అంతన్నాడు, ఇంతన్నాడు. తీరా పోలింగ్ జరిగేనాటికి చేతులెత్తేశాడు. అవును ఇదంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే. తమనే నమ్ముకున్న లక్షలాది మంది అభిమానులను, సామాజికవర్గంలోని జనాలను కొణిదెల కుటుంబంలోని హీరో రెండోసారి కూడా నిండా ముంచేశారు. రాజకీయ నేతగా తాను ముణగటంతో పాటు తనను నమ్ముకున్న వాళ్ళని కూడా ముంచేశాడు పవన్.
ఒకవైపు పోలింగ్ మొదలైన మూడు గంటలకే అంటే ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలోనే జనాల తీర్పును శిరాసవహిస్తానని ప్రకటించటమంటే ఏమిటర్ధం ? విజయవాడ పడమటలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ జనాలు ఏ తీర్పు చెప్పినా తనకు సమ్మతమే అన్నట్లుగా చెప్పేసి వెళ్ళిపోయారు.
పవన్ చేసిన ప్రకటన ఓట్ల కౌంటింగ్ మొదలైన తర్వాత వెలువడుతున్న ట్రెండ్స్ ను చూసి చెప్పాల్సింది. కానీ పోలింగ్ మొదలైన వెంటనే చెప్పేశారంటే అర్ధమేంటి ? ఎన్నికల్లో పోరాటం చేయకుండానే చేతులెత్తేసినట్లే కదా ? ఏ రాజకీయ నేతైనా పవన్ లాగ ప్రకటన చేస్తాడా ? ప్రచారంలో ఉన్నపుడు కాబోయే సిఎం తానే అని అన్నాడు. మరోసారి తనకు సిఎం అవ్వాలని లేదంటూనే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయొద్దన్నాడు.
ప్రచారంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, జనాలనే కాదు చివరకు పార్టీ నేతలను కూడా అయోమయంలో పడేసిన పవన్ ఎన్నికల్లో చివరికంటూ పోరాడకుండానే కాడి దింపేశాడు. ఇక్కడే జనసేనకు దెబ్బ పడిపోయింది. పవన్ పోరాటపటిమ చూసిన తర్వాత జనాలు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఇటు గాజువాకలోను అటు భీమవరంలోను తమకు పవన్ వద్దంటూ దండాలు పెట్టేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఏది నిజమో తెలియాలంటే మే 23వ తేదీ వరకూ ఆగాల్సిందే.
