ముద్రగడ మరో లేఖాస్త్రం.! జనసేనానికి సంకటమే.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో లేఖాస్త్రాన్ని సంధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకి.! చేతనైతేనే, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్‌ని స్వీకరించి, ఆయన మీదకు పోటీకి దిగు. లేకపోతే, పిఠాపురంలో నా మీద పోటీ చెయ్..’ అంటూ ముద్రగడ తన తాజా లేఖలో విసిరిన సవాల్ హాట్ టాపిక్ అవుతోంది.!

జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై జనసేనాని విమర్శలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ‘నన్నెందుకు వివాదంలోకి లాగావ్.?’ అని ప్రశ్నిస్తున్నారు ముద్రగడ పద్మనాభం.

మరోపక్క, కాకినాడలో జనసేనాని చేసిన విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ‘బస్తీ మే సవాల్.. నా మీద పోటీ చెయ్.. చిత్తు చిత్తుగా ఓడిస్తా..’ అంటున్నారు. జనసేనాని మాత్రం స్పందించడంలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా వదలడంలేదు.

తాజాగా, ముద్రగడ పద్మనాభం సీన్‌లోకి వచ్చారు. పిఠాపురంలో పోటీ చేస్తానంటున్నారు ముద్రగడ పద్మనాభం. వైసీపీ నుంచి పోటీ చేస్తారా.? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, ముద్రగడ లేఖతో జనసేనానికి కొంత సంకట పరిస్థితి అయితే వచ్చింది.

వాస్తవానికి ముద్రగడ లేఖలతో జనసేనకు చెడు కంటే మంచి ఎక్కువగా జరుగుతోంది. ముద్రగడను కాపు సామాజిక వర్గం లైట్ తీసుకుంటోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తోంటే, దాన్ని ముద్రగడ చెడగొడుతున్నారన్న భావన కాపు సామాజిక వర్గంలో కనిపిస్తోంది.

కానీ, పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రినవుతాననే మాట కంటే, టీడీపీతో పొత్తు గురించిన మాట గట్టిగా చెబుతున్నారు. అదొక్కటే జనసేనకు మైనస్ అవుతోంది కాపు సామాజిక వర్గంలో.