పవన్ ను ఎవరూ ప్రశ్నించకూడదా ?

రాజమండ్రిలో జరిగిన  జనసేన పార్లమెంటరీ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ సోదరుడు, మొన్నటి ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయిన నాగుబాబు అలాగనే చెబుతున్నారు. ప్రశ్నించేందుకే జనసేన పార్టీని పెట్టానని చెప్పిన పవన్ ను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదట. పవన్ ఏం చెప్పినా నేతలు, కార్యకర్తలు గుడ్డిగా అనుసరించాలని ఈయన గారు చెబుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేటప్పటికి నాగుబాబుకు కూడా బుర్ర చెడిపోయిందేమో ? పార్టీలో అలా చేయండి..ఇలా చేయండని తాను పవన్ కు చెప్పడట. పవన్ ఏం చెబితే అది వెంటనే చేసేస్తాడట. వాళ్ళంటే అన్నా దమ్ములు కాబట్టి వాళ్ళిష్టం. మరి బయట వాళ్ళు పవన్ ను ఎందుకు ప్రశ్నించకూడదని నాగుబాబు అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.

ఒక నిజమైన కార్యకర్త ఎప్పుడూ పార్టీ అధినేతను ప్రశ్నించకూడదటని నాగుబాబు చెబుతున్నారు. అందరికన్నా పవన్ కు ఎక్కువ విజన్ ఉంది కాబట్టే ప్రశ్నించకూడదనే కారణాన్ని కూడా చెప్పేశారు నాగుబాబు. నాగుబాబు లాంటి భజన బ్యాచ్ పవన్ చుట్టూ చేరిన కారణంగానే జనసేనకు మొన్న అంతటి ఘోర ఓటమి ఎదురైంది. నాలుగు రోజులు గట్టిగా జనాల్లో తిరిగితే  పదిహేను రోజులు అడ్రస్ ఉండని పవన్ ను నమ్ముకుంటే జనసేన నేతల సంగతి గోవిందా.

పవనే అనుకుంటే సోదరుడు నాగుబాబు మరో నాలుగాకులు ఎక్కువే తిన్నట్లున్నారు. ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని చెప్పుకునే పవన్ ను ఎవరూ ప్రశ్నించకూడదని సోదరుడు చెప్పినపుడే పార్టీలో ప్రజాస్వామ్యం ఎలాగుందో అర్ధమైపోతోంది. మొత్తం మీద పవన్ ను అంతా కలిసి నిండా ముంచేసేట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కక పోవటంతో చాలామంది నేతలు ఇప్పటికే జనసేనకు రాజీనామా చేసేశారు. మిగిలిన వాళ్ళను నాగుబాబు తరిమేసేట్లున్నాడు.