నిజమేనా.? నమ్మొచ్చా.? తెలుగుదేశం పార్టీతో పొత్తుకి జనసేన సిద్ధంగా లేదన్న ప్రచారంలో నిజమెంత.? జనసేన ఆవిర్భావ దినోత్సవం వేదికగా జనసేనాని, పొత్తులపై ఇవ్వబోయే స్పష్టత ఇదేనా.? తాజాగా, మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 20 సీట్లు అనీ, వెయ్యి కోట్లు అనీ.. జనసేన మీద దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నది జనసేనాని ఆవేదన. పొత్తుల విషయమై జనసైనికుల ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి రానివ్వబోనని జనసేనాని స్పష్టం చేస్తున్నారు.
మరోపక్క, ‘మీకు 20 సీట్లు ఇవ్వడమే ఎక్కువ.. గట్టిగా మాట్లాడితే మీతో మాకు పొత్తు అవసరం లేదు..’ అంటూ టీడీపీ సోషల్ మీడియా మద్దతుదారులు అప్పుడే రచ్చ షురూ చేశారు. మరో వైపు, టీడీపీ ముఖ్య నేతలు కొందరు టీడీపీ అనుకూల మీడియా ద్వారా ‘పొత్తుల్లేవ్.. ఇకపై జనసేనతోనూ రణమే..’ అంటూ లీకులు పంపుతున్నారు.
సో, వైసీపీ ముచ్చట తీరిపోనుందన్నమాట. టీడీపీ, జనసేన విడిగానే పోటీ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. అది అధికార పార్టీకి ఎంతో కొంత లాభం చేస్తుంది. ఎందుకంటే, వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చీలిపోతుంది గనుక. అయితే, ఈ విషయమై టీడీపీ, జనసేన పార్టీల్లో ఇంకా కొంత గందరగోళం వుందన్న వాదనైతే లేకపోలేదు.
కాగా, టీడీపీతో పొత్తు వద్దే వద్దంటూ జనసైనికులు సోషల్ మీడియా వేదికగా అధినేత పవన్ కళ్యాణ్కి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గ ప్రతినిథులు కూడా ‘పొత్తు వద్దు’ అంటూ జనసేనానికి సూచిస్తున్నారు.
