తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసు కథ కూడా నయీం దందాల కేసు, మియాపూర్ భూకబ్జాల కేసు, సిఎంఆర్ఎఫ్ కుంభకోణం, వక్ఫ్ భూమల కేసుల్లానే ముగిసిపోయిందని ఒకవైపు ప్రచారం జరుగుతున్న తరుణంలో మళ్లీ కలకలం రేగింది. తాజాగా ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య కేసును కదిలించారు. పూర్తి వివరాలు చదవండి.
ఓటుకు నోటు కేసును సిబిఐకి అప్పగించాలని జెరూసలేం మత్తయ్య కోర్టును కోరారు. సుప్రీం కోర్టులో గురువారం ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఏ4 నిందితునిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు తన తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే తాను న్యాయవాదులను నియమించుకుంటే ప్రభుత్వాలు వారిని డైవర్ట్ చేసే అవకాశం ఉందని సుప్రీం కోర్టు వారే న్యాయవాదిని నియమించాలని మత్తయ్య కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన కోర్టు మత్తయ్యకు అమికస్ క్యూరిగా సిద్ధార్ధ్ ధవేను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. మత్తయ్యకు తెలంగాణ డిజిపి అపాయిట్ మెంట్ ఇవ్వాలని అతను చెప్పేది వినాలని ఉత్తర్వులిచ్చింది. జనవరి 29 కి కేసు విచారణను కోర్టు ఆదేశాలిచ్చింది. ఓటుకు నోటు కేసు పూర్వ నేపథ్యమిదే…
2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. దీనిలో ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ లు కూడా నిందితులు. మత్తయ్య నాలుగో నిందితుడు. వీరందరి పై అభియోగాలు మోపుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది.

రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మత్తయ్య మాత్రం పారిపోయాడు. అతను పోలీసులకు దొరకలేదు. ఇదే కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా వినిపించింది. అతను ఫోన్ లో స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా ఆడియో టేపు బయటకు వచ్చింది. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
ఓటుకు నోటు కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం విచారణను కూడా వేగవం చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని పలువురు నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాంపింగ్ ను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా విచారణను చేపట్టింది. తెలంగాణలో నయీం కేసును మూసివేసినట్టుగానే ఓటుకు నోటు కేసును కూడా అలాగే మూసి వేస్తారనే చర్చ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే మత్తయ్య ఎక్కడో దాచుకున్నాడని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి వెతికినా మత్తయ్య ఆచూకీ రాలేదు. అందరిని ఆశ్చర్య పరుస్తూ మత్తయ్య హైకోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఇందులో తన పాత్ర లేదని కేసు నమోదు కాకుండా చూడాలని కోరారు. ఈ కేసులో పలువురు రాజకీయ నేతలను కూడా విచారించారు. అయినా ఇప్పటి వరకు కేసు విచారణకు రాలేదనే విమర్శలు ఉన్నాయి.
ఓటుకు నోటు కేసుతో తనకు అసలు సంబంధం లేదని క్రిస్టియన్ సమస్యల మీద చర్చించేందుకే తాను స్టీఫెన్ సన్ ని కలిశారన్నారు. ఈ విషయాలన్నింటిని ప్రస్తావిస్తూ తనకు అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకి వచ్చి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా రాజకీయ నాయకులేనని తనను బలి పశువును చేసేందుకు కుట్ర చేస్తున్నారని మత్తయ్య ఆరోపించారు.

తాను లాయర్ ని నియమించుకున్నా కూడా ప్రభుత్వాలు ఆ లాయర్ ని డైవర్ట్ చేసే అవకాశం ఉందని సుప్రీం కోర్టే తనకు లాయర్ ని నియమించాలని కోరారు. దీనికి స్పందించిన కోర్టు మత్తయ్యకు అమీకస్ క్యూరీగా సిద్దార్ధ్ ధవేను నియమించింది. జనవరి 29 కి కేసు వాయిదా వేసింది. ఎన్నికల వేళ ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో అంతటా చర్చ జరుగుతోంది.
