‘జగన్ కు అసలు అనుభవమే లేదు. ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు’ ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. నిజమే చంద్రబాబు చెప్పినట్లుగా జగన్ కు అభివృద్ధి ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే, జగన్ ఎప్పుడు అధికారంలో లేరుకాబట్టి. అభివృద్ధి చేసే అవకాశం అధికారంలో ఉన్న వారికే సాధ్యం కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఎలా సాధ్యం. వైఎస్ సిఎంగా ఉన్నపుడు జగన్ ఎంపిగా ఉన్నారు. హఠాత్తుగా వైఎస్ మరణించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశారు.
కొత్తగా వైసిపిని పెట్టుకున్నప్పటి నుండి జగన్ ది ప్రతిపక్షమే అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు. అప్పటికేదో ప్రతిపక్ష ఎంఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో కూడా తన ప్రభుత్వం అభివృద్ధి చేసేస్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు చంద్రబాబు. ప్రోటోకాల్ ప్రకారం జగన్ కు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా చంద్రబాబు ఇవ్వటం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మీదున్న కోపమంతా చంద్రబాబు ఇపుడు జగన్ మీద చూపుతున్నారు.
అందువల్లే ఇద్దరి మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగా మారిపోయింది. దాంతో ఎలాగైనా జగన్ ను దెబ్బతీయాలన్న నిర్ణయంతో ఫిరాయింపు రాజకీయాలు మొదలుపెట్టారు. 23 ఎంఎల్ఏలు, 3 ఎంపిలను లాక్కున్న తర్వాత కూడా జగన్ ఏమాత్రం ఖాతరు చేయకపోవటంతోనే చంద్రబాబులో ఉక్రోషం పెరిగిపోతోంది. దానికి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తోడయ్యింది. అందుకే అవసరమున్నా లేకపోయినా పదే పదే సందర్భాన్ని సృష్టించుకుని మరీ జగన్ ను విమర్శిస్తున్నారు. చిన్న, పెద్దా అంటే జగన్ కు గౌరవమే లేదట. జగన్ పై ఆరోపణలు చేయటానికి చంద్రబాబుకు ఇంతకన్నా అంశమే దొరకలేదా ?
గురివింద గింజ నీతి చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. తనలో లోపాలు పెట్టుకుని అవే లోపాలను ప్రత్యర్ధులపైకి నెట్టేసి బురద చల్లటం చంద్రబాబుకు మొదటి నుండి అలావాటే. అందరిలోను ఉన్నట్లే జగన్ లో కూడా లోపాలుంటే ఉండొచ్చు. అంతమాత్రానా ఎదుటి వారికి మర్యాదివ్వడు, చిన్నా, పెద్దా చూడడు అంటూ చిన్న పిల్లలు క్లాసులో టీచర్ కు చెప్పినట్లు సిఎం చెప్పటమంటే ఆశ్చర్యంగా ఉంది.
