టిడిపి ఎంపిలు బిజెపిలోకి జంప్… ధృవీకరించిన ఎల్లో మీడియా

చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎల్లో మీడియానే టిడిపి ఎంపిలు బిజెపిలోకి వెళ్ళిపోతున్నారని రాయటమే విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే కొంత కొల్లేరైపోయినా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ముక్క కూడా ఎల్లో మీడియా రాయదు. అలాంటిది ఆ మీడియాలోనే టిడిపి ఎంపిలు బిజెపిలోకి వెళిపోతున్నారని చెబుతోందంటే అర్ధమేంటి ?

ఎల్లో మీడియాలోని ఒకదానిలో ఇద్దరు ఎంపిలు బిజెపిలోకి చేరిపోతున్నారని వస్తే  మరోదానిలో నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళిపోతున్నట్లు రాసింది. అంటే ఆ మీడియాలోనే అలా వచ్చిందంటే కచ్చితంగా టిడిపి ఎంపిలు బిజెపిలోకి వెళిపోవటం ఖాయమనే అనుకోవాలి.

పైగా పేర్లు రాయకుండానే సదరు ఎంపిలతో మాట్లాడినపుడు బిజెపిలో వెళ్ళే అవసరాలపై ఆలోచిస్తున్నామని చెప్పినట్లుగా రాసింది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈనెలాఖరులోనే నలుగురు ఎంపిలు చంద్రబాబుకు గుడ్ బై చెప్పటం ఖాయమనే అనిపిస్తోంది.

ఎంపిలతో పాటు మాజీ ఎంపిలు, మాజీ మంత్రులు, పలువురు నేతలు కూడా బిజెపిలోకి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నట్లు సదరు మీడియానే ప్రముఖంగా చెప్పింది. చూడబోతే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో ఎల్లో మీడియానే  సదరు ఎంపిలకు చెప్పి బిజెపిలోకి పంపుతున్నదా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమైనా మరో నాలుగు రోజుల్లో విషయం తెలిసిపోతుంది కదా ?