ఏ కొంపలో దూరడానికి పోతున్నారు: అంబటిపై జనసేన మహిళా నేత

రాజకీయాల్లో విమర్శలు సహజం.. అని ప్రతిసారీ చెప్పుకుంటూనే వుంటాం. కానీ, ఆ విమర్శల స్థాయి నానాటికీ దిగజారిపోతూనే వుంది. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సెటైరేశారు.. అదీ జనసేనాని ప్రస్తావన తేకుండానే.

‘తన దూర కంత లేదు.. మెడకో డోలు అన్నట్లు తాను గెలవలేదు.. గెలవలేడు. వైకాపాని గెలవనీయడట..’ అంటూ సెటైరేశారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు. ఇందులో తప్పేముంది.? పోటీ చేసిన రెండు చోట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో వైసీపీని గెలవనీయనంటూ శపథాలు చేసేశారు జనసేనాని. ఏమయ్యింది.? వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచింది.

అయినాగానీ, మళ్ళీ ఇప్పుడు జనసేన అధినేత అదే మాట చెబుతున్నారు. వినేవాళ్ళు ఏమనుకుంటారోనన్న సోయ కూడా జనసేన అధినేతలో కనిపించడంలేదు. సరే, తానే అధికారంలోకి వస్తానని జనసేన అధినేత నమ్మితే, ఆయన ఆ మాట అనొచ్చు. కానీ, ఆయనకు అంత నమ్మకం లేదు. ఎందుకంటే, సోలోగా ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన చెప్పలేకపోతున్నారు గనుక.

ఇక, అంబటి రాంబాబు ట్వీటుని వేరేలా అర్థం చేసుకున్నట్టున్నారు జనసేన నేత, ఆ పార్టీ అధికార ప్రతినిథి రాయపాటి అరుణ. మహిళ అన్న సోయ ఆమెకి కాస్తయినా వున్నట్టు లేదు. ఆ స్థాయిలో వుంది ఆమె స్పందన. దిగజారుడుతనానికే పరాకాష్టలా తయారైంది.

‘మీరంటే ఆ దూరటాల్లో మంచి ఎక్స్‌పర్ట్.. అందరికీ అంత నైపుణ్యం ఎక్కడ వుంటుంది బాబాయ్. ఈ రోజు ఏ కొంపలో దూరడానికి పోతున్నారు. అట్టా పోయే మార్గంలో ఒక్కసారి పోలవరంలోకి దూరి చూడకూడదు.. రైతులు బాగు పడతారు..’ అంటూ రాయపాటి అరుణ ట్వీటేశారు. ఆమె ప్రదర్శించిన మాటల చాతుర్యంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.