పంచ్ పడింది: పోలీసు శాఖ వైసీపీలో విలీనం!

ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతుంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి రేపిన కాక.. ఉండేకొద్దీ పొగలు సెగలు కక్కుతుంది. దానికి తోడు అధికారపార్టీ చేస్తున్న అనాలోచిన పనులో, అజ్ఞానపు పోకడలో ఈ వ్యవహారనికి మరింత ఆజ్యం పోస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పైనా, పోలీసు వ్యవస్థపైనా తనదైన శైలిలో ఫైరయ్యారు!

రాష్ట్రంలో హోం శాఖను పూర్తిగా మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా..? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన… రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని ఆరోపించిన బాబు.. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణలు అని విమర్శించారు.

ప్రస్తుతం టీడీపీ నేతలపైన జరుగుతున్న ఒక్కో దాడి.. వైసీపీ సమాధికి కట్టే ఒక్కో ఇటుక అని.. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్.. ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.

కాగా… గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు సోమవారం సాయంత్రం దాడి చేసి, విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే!

మరి ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి ఇంకా ఎంతదూరం పోతుంది అనేది వేచి చూడాలి!